భారత విజ్ఞానం
మహాభారతంలో విదురుడు ధర్మానికి, జ్ఞానానికి ప్రతీక. విదురుడు అంబిక, అంబాలికల దాసి అయిన పరిశ్రమి కి జన్మించినప్పటికీ, తన అపారమైన మేధస్సు, ధర్మవర్తనతో కురు సామ్రాజ్యాధిపతి ధృతరాష్ట్రునికి ప్రత్యేక సలహాదారుగా, ప్రధానమంత్రిగా ఎదిగాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి ప్రముఖులు కొన్ని సందర్భాలలో విదురుని వద్దకు సలహాల కోసం సంప్రదించేవారు. విదురుడు శ్రీ కృష్ణునికి పరమ భక్తుడు, పాండవుల శ్రేయోభిలాషి.
విదురుని జీవితంలో ముఖ్యాంశాలు...
విదురుని జన్మరహస్యం ఒక ప్రత్యేకం. కురువంశాన్ని నిలబెట్టి, రక్షించడానికి దేవర న్యాయం ద్వారా వేదవ్యాసుడు అంబిక వద్దకు వెళ్లగా, ఆమె భయంతో కళ్ళు మూసుకోవడంతో అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. ఆ తర్వాత అంబాలిక భయపడి పాలిపోయినట్లు అవడంతో ఆమెకు పాండురోగంతో కూడిన పాండురాజు జన్మిస్తాడు. మూడవసారి రాణి అంబిక తన దాసి అయిన పరిశ్రమిని పంపగా, ఆ దాసి భయపడకుండా వ్యాసునికి సేవలు చేస్తుంది. దేవరన్యాయం ద్వారా ఆమెకు జ్ఞానస్వరూపుడైన విదురుడు జన్మిస్తాడు. మాండవ్య మహర్షి శాపం వల్ల భూమిపై యమధర్మ రాజు అంశ దాసీపుత్రుడిగా విదురుని పేరుతో జన్మించవలసి వచ్చింది.
మొదటి నుండి విదురుడు ఎంతో సత్ ప్రవర్తన కలిగిన వాడు. మహాభారతంలో అత్యంత నీతిపరుడిగా పేరుగాంచాడు. కురుసభలో పాండవులకు జరిగిన అన్యాయాలను, ద్రోహాలను ఖండించాడు. విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పిన నీతులను ‘విదుర నీతి’ అని పిలుస్తారు. ఈ నీతి అత్యంత ప్రాచీనమైన, విలువైన జీవిత సత్యాలను బోధిస్తుంది. విదురునికి ప్రారంభం నుండి కృష్ణ భక్తి ఎక్కువ. కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపేందుకు విదురుడు ఎంతో ప్రయత్నించాడు. ఇందుకోసం ద్వారక నుండి రాయబారిగా వచ్చిన శ్రీ కృష్ణుడు కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు ఏర్పాటు చేసిన ఆతిధ్యాన్ని తోసిపుచ్చి, ధర్మ కోవిదుడైన విదురుని ఇంటే బస చేసి ఆతిథ్యం స్వీకరించాడు. యుద్ధం అనివార్యం అయినప్పుడు విదురుడు కౌరవ పక్షం వహించలేదు.
విదుర నీతిలోని ముఖ్యాంఖాలు వచ్చేవారం....
– సి.ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్


