భారత విజ్ఞానం
విదురుడు ధృతరాష్ట్రునికి అనేక విధాలుగా నీతిని బోధించాడని గతవారం చెప్పుకున్నాం కదా... విదురుడు బోధించిన నీతిసూత్రాలు విదురనీతిగా ప్రసిద్ధి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు...
→ ఎల్లప్పుడూ అందరి శ్రేయస్సును కోరుకోవాలి. ఏ ఒక్క వర్గానికీ అపకారం, దుఃఖాన్ని కలిగించాలని కనీసం మనసులో అయినా అనుకోకూడదు.
→ కష్టాలు, ఆపదలు, ప్రతికూలతల్లో ఉన్న వారిపై శ్రద్ధ పెట్టాలి. మనల్నే నమ్మి ఆధారపడిన వారి నిరంతర బాధలను, అవి చిన్నవైనా నిర్లక్ష్యం చేయకూడదు.
→ సకల ప్రాణుల పట్ల కరుణ చూపాలి.
→ మేలు చేసే పనులే చేయాలి.
→ ఎవరి వల్లా వ్యవసాయ, ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధికి, పెరుగుదలకు ఎప్పుడూ ఆటంకం కలిగించరాదు.
→ భద్రత, రక్షణ కోసం మనపై ఆధారపడిన వారిని కాపాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
→ ప్రజల పట్ల న్యాయంగా వ్యవహరించాలి. వారికోసం అంకిత భావంతో అందుబాటులో ఉండాలి.
→ సద్గుణం ద్వారానే విజయాన్ని సాధించి నిలబెట్టుకోవాలి.
→ ప్రజల సంక్షేమాన్ని వ్యక్తిగత బాధ్యతగా భావించాలి.
→ అభ్యసనాన్ని, జ్ఞాన ప్రసారాన్ని్రపోత్సహించాలి.
→ లాభాన్ని, సద్గుణాన్ని ప్రోత్సహించాలి.
→ శ్రేయస్సు మంచి పనులపై ఆధారపడి ఉంటుంది. మంచి పనులు శ్రేయస్సుపై ఆధారపడి ఉంటాయి.
→ దుష్టులతో... పాపాత్ములతో స్నేహాన్ని విడిచిపెట్టాలి.
→ ఎన్నడూ సంపదను దుర్వినియోగం చేయకూడదు.
→ కఠినమైన మాటలు మాట్లాడకూడదు, తీవ్రమైన లేదా క్రూరమైన శిక్షలు విధించకూడదు.
→ సద్గుణ చరిత్ర, స్వభావం, చురుకుదనం కలిగి ఉండాలి.
– సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్


