సందర్భం
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగ సందడి ఇప్పటికే ఆరంభం అయింది. ఈ సందర్భంగా ఆషాఢ బోనాల విశిష్టత, వివిధ ఆలయాల్లో జరిగే ప్రధాన జాతరల వివరాలను సమగ్రంగా తెలుసుకుందాం.
‘బోనం’ అనే పదం ‘భోజనం’ అనే ప్రకృతి పదం నుండి వచ్చింది. ఇది తమను అంటువ్యాధులు, రకరకాల ప్రకృతి విపత్తుల బారిన పడకుండా చల్లగా చూస్తున్నందుకు గాను కృతజ్ఞతతో అమ్మవారికి సమర్పించే పవిత్రమైన నైవేద్యం.
తయారీ విధానం: కొత్త మట్టి కుండలో పాలు, నీళ్లు, బెల్లం, కొత్త బియ్యంతో అన్నం (పరమాన్నం లేదా పసుపు అన్నం) వండుతారు. ఈ కుండకు సున్నం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, వేపాకులు, పూలతో అందంగా అలంకరిస్తారు. కుండపై వెలిగించిన దీపాన్ని ఉంచి, మహిళలు భక్తిశ్రద్ధలతో తలపై మోస్తూ మంగళవాద్యాల నడుమ ఆలయానికి తరలివెళ్తారు.
ఈ పండుగ వెనుక ఉన్న ఆచారాలు: బోనాల జాతరలో భక్తితో పాటు అద్భుతమైన జానపద కళారూపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
శివసత్తుల పూనకాలు: డోలు సప్పుడు, మైసమ్మ, మహంకాళి పాటల మధ్య శివసత్తులు పూనకంతో ఊగిపోతూ భక్తులకు వేపమండలతో దీవెనలు అందిస్తారు.
ఘటోత్సవం – రంగం (భవిష్యవాణి): పండుగలో భాగంగా అమ్మవారి ఘటాల ఊరేగింపు జరుగుతుంది. జాతర ముగిసే మరుసటి రోజు ఉదయం ‘రంగం’ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జోగిని పచ్చి మట్టి కుండపై నిలబడి, భవిష్యత్తులో వచ్చే వర్షాలు, పంటలు, ప్రజల క్షేమం గురించి అమ్మవారి సాక్షిగా భవిష్యవాణి చెబుతుంది.
ఆరోగ్య రహస్యం: వర్షాకాలం (ఆషాఢం) ప్రారంభంలో మశూచి, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వీటి నుంచి ప్రజలను కాపాడాలని కోరుకుంటూ భక్తులు వేపాకులు, పసుపుతో సాకపెట్టడం వల్ల అవి సహజ సిద్ధమైన కిమినాశకాలుగా పనిచేసి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి.
జూలై 16న గోల్కొండ కోటలో ప్రారంభమైన ఆషాఢ బోనాల మహోత్సవాలు ఆగస్టు 13, 2026 వరకు నెల రోజుల పాటు ముక్కోటి దేవతల సాక్షిగా సాగుతాయి. బోనాల పండుగ కేవలం ఒక మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు, అది తెలంగాణ ప్రజల ఐక్యతకు, ఆచారాలకు అద్దం పట్టే ఒక సాంస్కృతిక పండగ. కులమతాలకు అతీతంగా ఊరంతా ఒక్కటై అమ్మవారిని కొలిచే ఈ జాతర వైభవం ప్రతి ఒక్కరినీ భకి ్త పారవశ్యంలో ముంచెత్తుతుంది. తెలంగాణ సంస్కృతిలో మమేకమైన ఈ జాతర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడిన వారిని కూడా ఈ పండగలో భాగస్వాములను చేస్తుంది.
పోతురాజుల విన్యాసాలు
బోనాల జాతరకు సిసలైన సింగారం బోనాల పండుగ అనగానే మొదట గుర్తొచ్చేది.. ఒళ్లంతా పసుపు, నుదుటున పెద్ద కుంకుమ బొట్టు, చేతిలో వేపమండలు, కొరడాతో డప్పు చప్పుళ్లకు అనుగుణంగా శివాలెత్తిపోయే పోతురాజు. పోతురాజుల విన్యాసాలు లేని బోనాల జాతరను ఊహించుకోలేము. ఈ ఉత్సవాలలో పోతురాజుల పాత్ర అత్యంత కీలకమైనది.
ఎవరీ పోతురాజు?
జానపద కథల ప్రకారం, పోతురాజు గ్రామ దేవతలైన మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ వంటివారికి ఏకైక తమ్ముడు. అమ్మవార్ల ప్రతిరూపమైన ఘటాలకు రక్షకుడిగా, ఊరేగింపునకు ముందు నడిచే సైన్యాధిపతిగా పోతురాజును భావిస్తారు.
వీర విన్యాసాలు: తీన్మార్ డప్పు చప్పుళ్లకు అనుగుణంగా గాల్లోకి ఎగురుతూ, చేతిలోని కొరడాతో నేలను కొడుతూ భీకరంగా నృత్యం చేస్తారు. భక్తి పారవశ్యంతో తమను తాము కొరడాతో కొట్టుకుంటూ విన్యాసాలు చేసే పోతురాజు చేతి కొరదా దెబ్బలు తినడానికి భక్తులు పోటీపడతారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, పోతురాజు చేత కొరడా దెబ్బలు తినడం వల్ల దిష్టి పోతుందని, రోగాలు రావని నమ్మకం. ఊరేగింపులో అమ్మవారి ’ఘటం’ ముందుకు కదపాలంటే పోతురాజు నృత్యం చేస్తూ దారి చూపిస్తూ ఉండాలి.
ఫలహార బండి ఊరేగింపు: సికింద్రాబాద్, లాల్ దర్వాజా బోనాలలో జరిగే ఫలహార బండ్ల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు పతాక స్థాయికి చేరుకుంటాయి.
గావు పట్టడం: జాతర చివరి రోజున అమ్మవారికి బలి ఇచ్చే ఆచారంలో భాగంగా, పోతురాజు కోడిపుంజును నోటితో కొరికి (గావు పట్టి) గుడి బయట విసిరేస్తారు. ఇది జాతరలోనే అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం.
వివిధ ఆలయాల్లో జాతరలు జరిగే తేదీల వివరాలు
జూలై 21న బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కళ్యాణోత్సవం, బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆగస్టు 2: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం– దీనిని ‘లష్కర్ బోనాలు‘ అని పిలుస్తారు. దీనికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఆగస్టు 3: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం–బోనాల పండుగలో అత్యంత కీలక ఘట్టమైన ‘రంగం’ (భవిష్యవాణి) జరుగుతుంది.ఆగస్టు 9: పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ఇది కేంద్ర బిందువు. ఇక్కడి ఘటాల ఊరేగింపుతో పండుగ ఊపు అందుకుంటుంది. ఉత్సవాల ముగింపు ఆగస్టు 13: నెల రోజుల పాటు సాగిన ఈ బోనాల మహా జాతర ముగుస్తుంది.
– డి.వి.ఆర్.


