నేపాల్ రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన బాలేంద్ర ‘బాలెన్’ షా.. ప్రధాని పీఠం అధిరోహించిన కొద్ది నెలల్లోనే తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పాత రాజకీయ వ్యవస్థపై విసుగుచెందిన యువతకు ఆశాకిరణంగా కనిపించిన ఆయన.. ఇప్పుడు అదే యువత నుంచి అనూహ్య రీతిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. జెన్జీ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన బాలెన్ షా.. అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే తన రాజకీయ ఇమేజ్ను కాపాడుకోవాల్సిన పరిస్థితికి చేరుకున్నారు.
మాజీ అండర్గ్రౌండ్ ర్యాపర్, సివిల్ ఇంజినీర్, ఖాట్మండు మేయర్గా తనదైన ముద్ర వేసిన బాలెన్ షా.. సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగారు. మార్చి ఎన్నికల్లో నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) భారీ మెజార్టీ సాధించడంతో.. నేపాల్లో కొత్త రాజకీయ శకానికి నాంది పలికిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నేతగా, వ్యవస్థలో మార్పు తీసుకురాగల నాయకుడిగా యువత బాలెన్ను ఆదరించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి.
వరుస నిర్ణయాలతో పెరిగిన అసంతృప్తి
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలెన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి. భారత్ నుంచి కొనుగోలు చేసే వస్తువులపై కస్టమ్స్ నిబంధనలను కఠినతరం చేయడం మొదటి వివాదంగా మారింది. సరిహద్దు ప్రాంతాల ప్రజలు రోజువారీ అవసరాల కోసం భారత్పై ఆధారపడుతుంటారు. మందులు, నిత్యావసర వస్తువులపై ప్రభావం పడటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. చివరకు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత భారత్తో సరిహద్దు అంశంపై బాలెన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాల వివాదంపై మూడో పక్షం సహాయంతో పరిష్కారం సాధించవచ్చనే సంకేతాలు ఇవ్వడం నేపాల్లో విమర్శలకు దారితీసింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.
భారత్ అంశంలో మారిన వైఖరి
విదేశీ ప్రతినిధులతో భేటీల విషయంలో బాలెన్ మొదట కఠిన వైఖరిని అవలంబించారు. మంత్రుల స్థాయి కంటే తక్కువ హోదా ఉన్న అధికారులతో సమావేశాలకు దూరంగా ఉంటానని చెప్పిన ఆయన.. తర్వాత తన విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. భారత, చైనా రాయబారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఇదే సమయంలో ఆర్ఎస్పీ అధినేత రవి లామిచ్చానేకు భారత్లో లభించిన ప్రాధాన్యం కూడా చర్చకు దారితీసింది. లామిచ్చానే భారత ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో సమావేశం కావడం నేపాల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది.
సొంత పార్టీతోనూ దూరం?
బాలెన్ పాలనా శైలిపై మరో ప్రధాన విమర్శ.. ఆయన పార్లమెంట్కు, సొంత పార్టీ కార్యక్రమాలకు తగినంత సమయం కేటాయించడం లేదనే ఆరోపణలు. ప్రధాని అయిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకు పరిమితంగా హాజరయ్యారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించాయి. ఆర్ఎస్పీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొనడం తగ్గిందనే చర్చ మొదలైంది. దీంతో బాలెన్ షా–పార్టీ నాయకత్వం మధ్య దూరం పెరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యువతే తిరగబడిన వేళ..
బాలెన్ ఇమేజ్కు అతిపెద్ద దెబ్బ జూలైలో తగిలింది. ఖాట్మండులో మున్సిపల్ పోలీసుల చర్యలపై అసంతృప్తితో రైడ్ షేర్ డ్రైవర్ గణేష్ నేపాలి ఆత్మాహుతికి పాల్పడిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వ చర్యలపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. అనధికార నివాసాల తొలగింపు, పేదలకు పునరావాసం కల్పించకపోవడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ఒకప్పుడు బాలెన్కు మద్దతుగా రోడ్లపైకి వచ్చిన యువతే.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం ప్రారంభించింది.
మత ఘర్షణలతో మరింత ఒత్తిడి
జూలై చివర్లో నేపాల్ దక్షిణ ప్రాంతాల్లో హిందూ–ముస్లిం వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు ప్రభుత్వానికి మరో పరీక్షగా మారాయి. ఈ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు బాలెన్ తొలిసారి ప్రధానిగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చింది.
ప్రజా ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన బాలెన్కు.. పాలన మాత్రం అంత సులభం కాదని ఈ 150 రోజులు నిరూపించాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసిన విధానం అధికారంలో కొనసాగించడం కష్టం. ప్రజల అంచనాలు, వ్యవస్థల నిర్వహణ, రాజకీయ సమన్వయం వంటి అంశాలు ఇప్పుడు ఆయన ముందున్న అసలు సవాళ్లు.
జెన్జీ ఆశల నాయకుడిగా ఎదిగిన బాలెన్ షా.. ఇప్పుడు అదే తరం ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన దశకు చేరుకున్నారు. ఐదు నెలల్లో మారిన ఈ రాజకీయ పరిణామాలు.. ప్రజాదరణ ఎంత వేగంగా పెరుగుతుందో, అంతే వేగంగా తగ్గిపోవచ్చని మరోసారి చాటిచెబుతున్నాయి.


