ఆసియా ఖండంలో వన్యప్రాణుల ఆరోగ్య రక్షణ, క్షేత్రస్థాయి సంరక్షణ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణి సంరక్షణ సంస్థ వంతారా ఇండోనేషియా ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్థానిక ‘ఫౌనా ల్యాండ్ గ్రూప్’ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ వివరాలను ఇండోనేషియా అటవీ శాఖ మంత్రి రాజా జూలీ ఆంటోనీ జకార్తాలోని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
కీలక సంస్కరణలు.. ఆధునిక మౌలిక వసతులు
ఈ భాగస్వామ్యం కింద వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
అడవుల్లోని వన్యప్రాణులకు తక్షణ వైద్యం అందించేందుకు 10 సంచార జంతు ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తున్నారు.
వే కాంబస్ ప్రాంతంలోని ఏనుగుల ఆసుపత్రిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘ఎలిఫెంట్ ట్రీట్మెంట్ అండ్ కేర్ సెంటర్’గా ఆధునీకరిస్తున్నారు. ఇది సంరక్షణలో ఉన్న 62 సుమత్రన్ ఏనుగులతో పాటు, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 100 అడవి ఏనుగులకు సేవలందిస్తుంది.
ఏనుగుల సంరక్షకులు, పశువైద్యులు, అటవీ శాఖ అధికారులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
‘వన్యప్రాణుల రక్షణ మా ప్రాథమిక బాధ్యత. వంతారా అనుభవం, వనరుల సహకారంతో మా సొంత మౌలిక వసతులను బలోపేతం చేసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో ఇండోనేషియా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తాయి’ అని రాజా జూలీ ఆంటోనీ తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో వంతారా విస్తరణ
వంతారా ఇటీవల ప్రకటించిన ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా జూమ్నగర్ కేంద్రంగా అభివృద్ధి చేసిన వైద్య నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తోంది. CITES నిబంధనలకు కట్టుబడి వన్యప్రాణుల సహజసిద్ధ ఆవాసాల్లోనే వాటి సంరక్షణకు (in-situ) శ్రీకారం చుట్టింది. వంటార సీఈఓ వివాన్ కరానీ మాట్లాడుతూ, ఇండోనేషియా జీవవైవిధ్యాన్ని కాపాడటంలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని పేర్కొనగా, ఫౌనా ల్యాండ్ సీఈఓ డెన్నీ గుణలెన్ ఈ నిర్ణయం స్థానిక అటవీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు!


