భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. గుజరాత్ అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), వంతారా సహకారంతో కచ్లోని బన్ని గడ్డి భూముల్లోకి 20 కృష్ణజింకలను తిరిగి సహజ వాతావరణంలోకి విడుదల చేశారు. ఇందులో 5 మగ కృష్ణజింకలు, 15 ఆడ కృష్ణజింకలు ఉన్నాయి. వీటిని జామ్నగర్లోని వంతారా నుంచి బన్నికి తరలించారు.
ఈ కృష్ణజింకలను అడవిలోకి వదిలిపెట్టడానికి ముందు.. వాటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కొంతకాలం క్వారంటైన్లో ఉంచారు. వ్యాధుల విషయంలో పర్యవేక్షణ చేసిన తర్వాత ప్రత్యేక జాగ్రత్తలతో బన్నికి తరలించారు. ఇందుకోసం సెంట్రల్ జూ అథారిటీ, గుజరాత్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ నుంచి అవసరమైన అనుమతులు కూడా తీసుకున్నారు.
బన్ని గడ్డి భూముల్లో గతంలో కృష్ణజింకలతో పాటు చింకారా, నీలగాయలు, అడవి పందులు వంటి జంతువులు పెద్ద సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు కృష్ణజింకలను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల అక్కడి సహజ ఆహార గొలుసు మరింత బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా.. గడ్డి భూముల జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత కూడా మెరుగుపడే అవకాశం ఉంది.


