ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో కొట్టుకుపోయి తీవ్రంగా గాయపడిన 53 ఏళ్ల ‘జాయ్మతి’ అనే ఆడ ఏనుగుకు అత్యవసర వైద్యం అందించేందుకు వంతారా రంగంలోకి దిగింది. నాగాలాండ్లోని నామ్సాంగ్ ప్రాంతంలో దికో నదిలో వరద ఉధృతికి కొట్టుకుపోయి, అస్సాంలోని శివసాగర్ జిల్లా బిహుబోర్ వద్ద ఒడ్డుకు చేరిన ఈ ఏనుగును అధికారులు, స్థానికులు కాపాడారు. అయితే, వరద ఉధృతి కారణంగా జాయ్మతి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి.
ఎయిర్లిఫ్ట్ ఎందుకంటే..
వరద నీటిలో కొట్టుకుపోవడం వల్ల జాయ్మతి నుదురు, చెవులు, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని అవయవాల వద్ద తీవ్రమైన పుండ్లు ఏర్పడగా, కుడి కన్ను దెబ్బతిని దృష్టి కోల్పోయింది. అంతేకాకుండా, గతంలో ఎడమ కాలు విరగడం వల్ల నడవలేక ఇబ్బంది పడుతోంది. వయసు పైబడటం, తీవ్రమైన గాయాల నేపథ్యంలో రోడ్డు మార్గంలో సుదీర్ఘ ప్రయాణం ఏనుగుకు మరింత శ్రమ కలిగిస్తుందని నిపుణులు భావించారు. దాంతో అత్యవసర వైద్యం కోసం గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న వంతారా ఏనుగుల ఆస్పత్రికి ఎయిర్లిఫ్ట్ ద్వారా తరలించాలని నిర్ణయించారు.
అస్సాంలో వైద్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదన
వంతారా ప్రతినిధులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. జాయ్మతి తరలింపు కేవలం తాత్కాలిక అత్యవసర వైద్యం కోసమేనని, కోలుకున్నాక తాన భద్రతను పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈశాన్య ప్రాంతంలో ఇటువంటి అత్యవసర పరిస్థితులను స్థానికంగానే ఎదుర్కొనేందుకు అస్సాం అటవీ శాఖ ఆధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేసేలా మూడు ప్రత్యేక వన్యప్రాణి వైద్య కేంద్రాలను (ప్రత్యేకంగా ఏనుగుల కోసం ఒక కేంద్రాన్ని) ఏర్పాటు చేయడానికి వంతారా ముందుకు వచ్చింది.
ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్


