కఠ్మాండూ: దేవభూమి నేపాల్లో వరద బీభత్సం నింపిన పెను విషాదంలో 157మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో స్థానికులు, పర్యాటకులు గల్లంతయ్యారు.
రాజధాని కఠ్మాండూకు ఉత్తరాన ఉన్న రసువా జిల్లాలో బుధవారం ఉదయం ఆకస్మికంగా విరుచుకుపడిన వరదతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఒక జలవిద్యుత్ కేంద్రం కొట్టుకుపోవడంతో పాటు పలు నిర్మాణాలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ వరద టిబెట్ నుంచి నేపాల్ వైపు ప్రవహించే బోటేకోషిలో పడిన మంచు కరగడం వల్ల వచ్చినట్టు అధికారులు చెప్పారు. అయితే భూకంపం కారణంగా సంభవించిన హిమపాతమే ఈ వరదలకు కారణమని నేపాల్ విదేశాంగ మంత్రి తెలిపారు.
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని తాకిన ఆకస్మిక వరదల కారణంగా కనీసం 157 మంది మరణించారు.వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కైలాష్ మానస సరోవరానికి వెళ్లిన కనీసం 133 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు.
నేపాల్ పోలీసులు 157 మృతదేహాలను వెలికితీశారు. వరద ముప్పు ప్రాంతాల కుటుంబాలను తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం, విపత్తు సంభవించిన కొన్ని గంటల తర్వాత, 341 మంది విదేశీయులతో సహా సుమారు 403 మంది పర్యాటకుల ఆచూకీ తెలియలేదు. గల్లంతైన విదేశీయులలో 142 మంది భారతీయులతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, మలేషియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, అమెరికా చెందిన వారు కూడా ఉన్నారని నేపాల్ పర్యాటక శాఖ వెల్లడించింది తెలిపింది.
ప్రధానమంత్రి బాలేంద్ర షా సహాయక చర్యలకు ప్రభుత్వ వనరులన్నింటినీ కేటాయిస్తామని హామీ ఇవ్వగా, నేపాల్ సహాయక బృందాలు బురద కింద పూడిపోయిన మృతదేహాలను వెలికితీయడం, క్షతగాత్రులను రక్షించే చర్యలను ముమ్మరం చేస్తున్నాయి.
తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్
మరోవైపు నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. నేపాల్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ భవన్లో ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో తెలంగాణ భవన్ అధికారుల సమన్వయం చేసుకుంన్నారు.
నేపాల్లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకుల కుటుంబ సభ్యులు హెల్ప్లైన్ను సంప్రదించాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బాధితుల పేరు, పాస్పోర్ట్, మొబైల్, నేపాల్లోని ప్రాంత వివరాలు అందించాలని సూచించారు. ట్రావెల్/టూర్ ఆపరేటర్, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. అందిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయానికి చేరవేయనున్నారు.తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ 9871999044, 9949351270, 9618597969 హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.


