హైదరాబాద్: అమెరికాలో నివాసం ఉంటున్న యువతి అదృశ్యమైంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు..పీర్జాదిగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన బుడిగె శైలజ కుమార్తె బుడిగె విహారిక (27), అల్లుడు హరీష్ లు ఈ ఏడాది జనవరి 26 నుంచి అమెరికాలో నివసిస్తున్నారు. అయితే ఈ నెల 20న విహారిక కనిపించడం లేదంటూ భర్త కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకోగా... విహారిక అమెరికా నుంచి తన పాస్పోర్ట్తో బయటకు వెళ్లినట్లు గుర్తించారు.
కుటుంబ సభ్యులు ఆమె హైదరాబాద్కు వస్తుందని భావించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లగా ఆమె అక్కడికి చేరుకోలేదు. అయితే ఆగస్టు 21న విహారిక ముంబై విమానాశ్రయంలో ఉన్నట్లు సమాచారం అందింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్ కలవకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. మేడిపల్లి పోలీసులు కేసు నమోదుచేశారు.


