తల్లిదండ్రులను గుర్తించకపోవడం వైఫల్యమేనన్న హైకోర్టు
శిశువుల అక్రమ రవాణాపై ధర్మాసనం ఆందోళన
తదుపరి విచారణ సెప్టెంబర్ 2కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా రక్షణ గృహాల్లోని చిన్నారుల సంఖ్య, అక్రమంగా దత్తత పొందినట్టు అనుమానించి స్వా«దీనం చేసుకున్న చిన్నారులు, ప్రభుత్వ స్పాన్సర్షిప్ పథకం లబ్ధిదారులు, ఫోస్టర్ కేర్ పథకం కింద ఉన్న చిన్నారులు.. ఇలా పలు వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో శిశువుల అక్రమ రవాణాపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్రమంగా దత్తత తీసుకున్న 9 మంది చిన్నారులను గుర్తించి రక్షించినా, అసలు తల్లిదండ్రులను గుర్తించకపోవడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ వచ్చే నెల 2కు వాయిదా వేస్తూ ఆలోగా పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
అవయవాల అక్రమ రవాణా, భిక్షాటన..
నల్లగొండకు చెందిన ఎం.వెంకన్న–స్రవంతి దంపతులకు సంతానం లేకపోవడంతో యాదగిరి ద్వారా ఓ చిన్నారి(శరణ్య)ని దత్తత తీసుకున్నారు. పిల్లలను అమ్ముతున్నాడన్న ఫిర్యాదు మేరకు యాదగిరిపై కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా శరణ్యను బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. దీన్ని సవాల్ చేస్తూ వెంకన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. కన్న తల్లిదండ్రులు కాకుండా మూడో వ్యక్తి ద్వారా పొందిన దత్తత చెల్లదన్నారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వెంకన్న అప్పీల్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వ సంరక్షణలోని పిల్లల పూర్తి వివరాలను 2వారాల్లో సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి, హోంశాఖను కూడా ప్రతివాదులుగా చేర్చాలన్నారు. సంబంధిత శాఖల్లో డైరెక్టర్ లేదా అదనపు కార్యదర్శి హోదాకు తగ్గని అధికారులు స్వయంగా సమగ్ర నివేదికలు సమర్పించాలని చెబుతూ, విచారణ వాయిదా వేశారు.


