సెప్టెంబర్‌ 2 నుంచి కాంగ్రెస్‌ మోసాలపై నిరసనలు | Harish Rao comments on Congress party pension promises | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 2 నుంచి కాంగ్రెస్‌ మోసాలపై నిరసనలు

Aug 31 2026 5:02 AM | Updated on Aug 31 2026 5:02 AM

Harish Rao comments on Congress party pension promises

పార్టీ శ్రేణులకు మాజీమంత్రి హరీశ్‌ దిశానిర్దేశం 

సిద్దిపేట జోన్‌: సిద్దిపేట గడ్డ నుంచి కాంగ్రెస్‌ వెయ్యి రోజుల మోసపాలనపై ప్రజాచైతన్యం పేరుతో మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. సెపె్టంబర్‌ 2 నుంచి పార్టీ ఆధ్వర్యంలో వారంపాటు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల గురించి చర్చించారు. కాంగ్రెస్‌ పార్టీ వెయ్యి రోజుల్లో చేసిన మోసాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. 

అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, ఇదే విషయాన్ని ప్రజల్లో ఎండగట్టేలా ప్రతీ కార్యకర్త ఒక సైనికుడి తరహాలో ముందుకు రావాలని సూచించారు. మళ్లీ కేసీఆర్‌ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆచరణ కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి ప్రజలను మోసం చేసిందని హరీశ్‌ మండిపడ్డారు. హామీల అమలు విఫలంతోపాటు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అవినీతి అక్రమాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

హామీల బకాయిలను మరోసారి బాకీ కార్డుల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 3న వ్యవసాయ రంగంలో కాంగ్రెస్‌ వైఫల్యాలను, 4న పెన్షన్‌ మహిళలకు రూ.2,500 హామీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర అంశాలపై వంటావార్పు, 5న జాబ్‌ కేలండర్, నిరుద్యోగం అంశంపై నిరసన, విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు బకాయిలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, తదితర అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని పిలుపునిచ్చారు. 6న సిద్దిపేట పట్టణంలో భారీ ఆటో ర్యాలీ, 7న ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు చేయాలని సూచించారు. నిరసన కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలని హరీశ్‌ స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement