ధరల పెరుగుదలతో చక్కెర వాడకం తగ్గిస్తున్న వినియోగదారులు
కొనుగోళ్లు తగ్గించామన్న 22 శాతం కుటుంబాలు
మరో 4 శాతం మంది స్వీట్లు, బిస్కెట్లకు దూరం
రోజుకు 100 గ్రాములు వాడుతున్నామన్న 5 శాతం మంది
టీ, కాఫీ, పాలల్లో వాడటానికి పెద్దపీట
ధర పెరిగినా ఆరోగ్యపరిమితికి మించి తీసుకునేవారూ అధికమే
లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో ఆసక్తికర అంశాలు
సాక్షి, హైదరాబాద్: పెరిగిన చక్కెర ధరలతో చాలా కుటుంబాలు వారి రోజువారీ జీవితంలో ‘తీపి’కి కాస్త దూరమవుతున్నాయి. చక్కెర ధరల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. చక్కెర ధర పెరగడంతో 22 శాతం కుటుంబాలు ఇంటి వినియోగానికి చక్కెర కొనుగోళ్లను తగ్గించినట్లు లోకల్ సర్కిల్స్ సంస్థ తాజా సర్వే వెల్లడించింది. మరో 4 శాతం కుటుంబాలు స్వీట్లు, ఇతర తీపి పదార్థాల కొనుగోలు.వినియోగాన్ని తగ్గించాయి. అయితే.. ధరల పెరుగుదలతో కొందరు చక్కెర వినియోగం తగ్గించినా.. దేశంలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు ఆరోగ్య పరిమితికి మించి చక్కెర తీసుకుంటున్నారన్న మరో ఆసక్తికర అంశాన్ని ఈ సర్వే తేల్చింది.

28 శాతం మంది రోజుకు 25 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ చక్కెర తీసుకుంటున్నట్లు వెల్లడైంది. వీరిలో 5 శాతం మంది రోజుకు 100 గ్రాములకు పైగా చక్కెర తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇంట్లో టీ లేదా కాఫీలో వేసే చక్కెర మాత్రమే కాదు..మనకు తెలియకుండానే బిస్కెట్, కేక్, చాక్లెట్, ఐస్క్రీమ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ద్వారా కూడా పెద్ద మొత్తంలో చక్కెర శరీరంలోకి వెళ్తోంది. దేశవ్యాప్తంగా 331 జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 45వేల కుటుంబాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ పేర్కొంది. సర్వేలో గుర్తించి ఆసక్తికర అంశాలు ఇలా...


