ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఏర్పాటుకు యోచన
లక్ష సీట్ల సామర్థ్యంతో నిర్మించనున్న బీసీసీఐ
డిసెంబర్ 9న సీఎం రేవంత్ శంకుస్థాపన చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం మరో అరుదైన కట్టడానికి వేదిక అవుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భాగస్వామ్యంతో భారత్ ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో భారీ క్రికెట్ స్టేడియం కొలువుదీరనుంది. సుమారు 1,00,000 సీట్ల సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఇది కార్యరూపంలోకి వస్తే దేశంలో రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అవతరించనుంది. గుజరాత్ అహ్మ దాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం 1,32,000 సీట్ల సామర్థ్యంతో ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డిసెంబర్ 9న ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి. దీని నిర్మాణ వ్య యం, నిర్వహణ ఖర్చులు బీసీసీఐ భరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించనుంది. ఔటర్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ ప్రతిపాదన, శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం.. స్టేడియానికి ప్రేక్షకుల రాకపోకలకు అనుకూలించనున్నాయి. ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న స్పోర్ట్స్ సిటీ, టూరిజం, నెట్జీరో సిటీ కాన్సెప్ట్ లో భాగంగా ఈ క్రీడా ప్రాంగణం కీలకం కానుంది.
ప్రస్తుతం ఉప్పల్లో క్రికెట్ స్టేడియమున్నా.. రానున్న కాలానికి తగ్గట్టు అధునాతన క్రికెట్ స్టేడియం అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్టేడియాన్ని క్రికెట్ మ్యాచ్లు మాత్రమే కాకుండా ఇతర క్రీడలకు తగ్గట్టుగా సైతం మలుచుకునేలా డిజైన్ చేయనున్నారు. అవసరాన్ని బట్టి ఫుట్బాల్ మ్యాచ్లు, భారీ కాన్సర్ట్లను నిర్వహించేలా నిర్మించనున్నారు. భారీస్థాయిలో ఈవెంట్స్ నిర్వహ ణకు ప్రస్తుతం హైదరాబాద్లో హెచ్ఐసీసీకి మించిన సముదాయం అందుబాటులో లేదు. దీంతో ఈ స్టేడియంలో అటువంటి సౌకర్యాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేయనున్నారు.


