ఎన్హెచ్–563 నిర్మాణంలో నాణ్యతాలోపాలు
దుర్శేడ్ వద్ద రోడ్డుకు మరోలోపం
రోడ్డు పొరలుగా కొట్టుకుపోయిన వైనం
ప్రారంభం కాని రోడ్డుకు మరమ్మతులు
ఒకే రోజులో భారీ గుంతకు ప్యాచ్వర్క్ పనులు
రూ.2,486 కోట్ల బడ్జెట్తో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రహదారి
రోడ్డు భద్రతపై ప్రయాణికుల్లో అనేక సందేహాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎన్హెచ్ 563 జాతీయ రహదారి నిర్మాణంలో లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఇటీవల కరీంనగర్ శివారులోని దుర్శేడ్ వద్ద వరంగల్ వెళ్లేందుకు ర్యాంపులు నిర్మించిన విషయం వెలుగుచూసిన విషయం మరవకముందే.. ఈసారి నిర్మాణ లుకలుకలు బట్టబయలయ్యాయి. ఎన్హెచ్ 563 వరంగల్–కరీంనగర్ సెక్షన్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం వరంగల్ నుంచి మానకొండూరు వరకు రోడ్డు దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. కానీ, దుర్శేడ్ వద్ద రోడ్డుకు సంబంధించి మరో లోపం వెలుగుచూసింది.
పెద్దపల్లి నుంచి వచ్చే వాహనాలు వరంగల్ వైపు వెళ్లేందుకు ఇక్కడ ర్యాంపు నిర్మించాల్సి ఉండగా అధికారులు దాన్ని నిర్మించలేదు. తాజాగా ఇక్కడే రోడ్డుపై భారీ ప్యాచ్వర్క్ ఇపుడు స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్హెచ్ 563లో భాగంగా హైదరాబాద్–రామగుండం రోడ్డు కలిసే దుర్శేడ్ వద్ద ఓ ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్పై భారీ ప్యాచ్ వర్క్ హాట్టాపిక్గా మారింది.
ఆరడుగుల వెడల్పు దాదాపు 200 అడుగుల పొడవున్న ఈ భారీ ప్యాచ్ కొత్త రోడ్డుపై ఎలా ఏర్పడిందో? పొరలుగా ఎందుకు కొట్టుకుపోయిదో అర్థం కాక స్థానికులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ప్రారంభమే కాని రోడ్డుకు మరమ్మతు లు చేయడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు. శనివారం వరకు ఈ ఫ్లై ఓవర్పై దాదాపు భారీ గుంత ఉండగా.. ఆదివారం వరకు ప్యాచ్వర్కులు పూర్తి చేశారని స్థానికులు, ప్రయాణికులు మండిపడుతున్నారు.
రూ.2,486 కోట్ల బడ్జెట్
ఖమ్మం నుంచి జగిత్యాల వరకు 248 కిలోమీటర్ల పొడవుతో నిర్మించే ఈ రోడ్డును సెక్షన్లుగా విభజించారు. అందులో 67.6 కి.మీల పొడవున్న కరీంనగర్–వరంగల్ సెక్షన్ రోడ్డును దాదా పు రూ.2,486 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. తొలుత రూ.2100 కోట్లతో చేపట్టగా ఇటీవల అది రూ.2,486 కోట్లకు చేరింది. జూలై 2026 డెడ్లైన్గా పెట్టుకున్న ఈ రహదారి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ప్రతీ కిలోమీటరుకు రూ.36 కోట్ల వరకు వెచ్చించారు. ఇప్పటి వరకూ రూ.961 కోట్ల వరకు ఖర్చు కాగా మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంది. అలాగే కరీంనగర్ నుంచి జగిత్యాల సెక్షన్కు దాదాపు రూ.1,979 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు.
అప్రోచ్ రోడ్లలోనూ ప్యాచ్ వర్క్
ఈ రోడ్డు నిర్మాణం పూర్తికాకముందే రోజుకో లోపం వెలుగుచూస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రధాన రహదారితోపాటు దుర్శేడ్ వద్ద జగిత్యాల వైపు వెళ్లేందుకు నిర్మించిన అప్రోచ్ రోడ్డుకు కూడా అపుడే ప్యాచ్ వర్క్లు మొదలయ్యాయి. డ్రైన్ను ఆనుకుని టైల్స్ వేసిన గుత్తేదారు.. ఆఖరులో మాత్రం సిమెంటుతో ప్యాచ్ వర్కు చేసి చేతులు దులుపుకున్నారు. అదే విధంగా ఫ్లైఓవర్ను కలుపుతూ నిర్మించిన వంతెనకు వేసిన సైడ్ వాల్స్కు పగుళ్లు కనిపిస్తున్నాయి. పలు చోట్ల సిమెంట్ సరిగా నింపకపోవడం వల్ల హనీకోంబ్స్(గ్యాప్లు) ఏర్పడ్డాయి. అలాగే వీటి మధ్య ఉన్న గ్యాప్స్ను నింపేందుకు సిమెంట్ పూసి మేనేజ్ చేశారు. కొన్నిచోట్ల ఖాళీల మధ్య చెక్కముక్కలను పెట్టడం కొసమెరుపు.


