కూతురును నడుముకు కట్టుకుని బావిలో దూకిన తల్లి | Quarrel between couple mother and daughter dead | Sakshi
Sakshi News home page

కూతురును నడుముకు కట్టుకుని బావిలో దూకిన తల్లి

Aug 31 2026 4:14 AM | Updated on Aug 31 2026 4:14 AM

Quarrel between couple mother and daughter dead

నీటిలో మునిగి ఇద్దరూ మృతి 

దండేపల్లి: దంపతుల మధ్య గొడవ, క్షణికావేశం.. పిల్లలను పోషించలేననే ఆందోళన ఓ తల్లిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. తాను చనిపోతే తన కూతురును కూడా ఎవరూ పట్టించుకోరని భావించిన ఆ తల్లి.. ఐదేళ్ల కూతురును నడుముకు కట్టుకుని బావిలో దూకింది. దీంతో ఇద్దరూ మృతిచెందారు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది. దండేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన గొట్ల రజిత (26)కు ఏడేళ్ల కిందట జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో వివాహమైంది. వీరికి అక్షిత (5), మూడేళ్ల కుమారుడు ఉన్నారు. 

అంజయ్య ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. మూడేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తతో కలిసి ఉండలేనని రజిత లింగాపూర్‌లోని పుట్టింటికి వచ్చింది. అంజయ్య అప్పుడప్పుడు అత్తగారింటికి వచ్చి భార్య పిల్లలను చూసి వెళ్తున్నాడు. ఆదివారం పని లేకపోవడంతో రజిత ఇంటివద్దే ఉంది. మధ్యాహ్నం అంజయ్య భార్య వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 

పుట్టింటికి వచ్చినా భర్త వేధింపులు ఆగడం లేదని భావించిన రజిత క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తాను చనిపోతే తన కూతురును ఎవరూ పట్టించుకోరని భావించి కూతురును కొంగుతో నడుముకు చుట్టుకుని బావిలో దూకింది. ఆత్మహత్యకు ముందు జన్నారం మండలంలో ఉంటున్న తన సోదరికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు వచ్చి గాలించగా బావిలో తల్లీకూతురు శవమై తేలారు. పోలీసులు కేసు దర్యాప్తు చేçస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement