పట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన వ్యక్తిగత జీవితం, రెండో వివాహంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భోజ్పురి బవాల్’ అనే వినోద కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ‘ఇంత పెద్ద బంగ్లాలో ఒంటరిగా ఉంటారా?’ అని ప్రశ్నించగా.. ‘నేను ఒంటరిగా ఎందుకుంటాను? ఇక్కడ చాలామంది ఉన్నారు. ప్రస్తుతం నా విడాకుల కేసు నడుస్తోంది. ఆ ప్రక్రియ పూర్తి కాగానే ఆమె వచ్చేస్తుంది.. అందులో పెద్ద చెప్పడానికేముంది?’ అని ఆయన బదులిచ్చారు. అయితే కాబోయే భాగస్వామి ఎవరనే వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ‘టీవీ ఛానెల్లో ఎలా చెబుతాను? అది నా వ్యక్తిగత విషయం’ అని తేజ్ ప్రతాప్ అన్నారు.
తేజ్ ప్రతాప్ యాదవ్కు 2018లో బిహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగ ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్య రాయ్తో వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కొద్ది నెలలకే వీరి మధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం కోర్టులో విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో గతంలో అనుష్క యాదవ్తో ఆయన దిగిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వివాదానికి దారితీసింది. ఆ పరిణామాల నేపథ్యంలో తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం తేజ్ ప్రతాప్ కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: రామునికే టోకరా.. రూ.3 బ్యాలెన్స్తో రూ. 4 కోట్ల చెక్ ఇచ్చి..


