బెంగళూరు/మైదుకూరు: కర్ణాటకలో చోటుచేసుకున్న భూ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, బెంగళూరు బీజేపీ నేత రవిప్రకాష్ మధ్య కొనసాగుతున్న భూ వివాదం కేసులో మైదుకూరు పోలీసులు రవిప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో, అరెస్ట్ ఘటన కలకలం రేపుతోంది.
అయితే, బీజేపీ నేత రవిప్రకాష్ను కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య సబీనా బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు కార్లలో వచ్చి తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. తనను కూడా కొట్టి, ఫోన్లను తీసుకున్నారని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్లపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. తనపై రవిప్రకాష్ దాడి చేశారని పుట్టా సుధాకర్ యాదవ్ వర్గీయుడు మురళీమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: వెలిగొండలోనూ క్రెడిట్ చోరీ
ఈ ఘటనపై గత జూలైలోనే కేసు నమోదైనట్లు సమాచారం. ఆ కేసులో భాగంగానే మైదుకూరు పోలీసులు ఇప్పుడు బీజేపీ నేత రవిప్రకాష్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు కిడ్నాప్ కేసు.. మరోవైపు దాడి కేసు.. మధ్యలో భూ వివాదం! టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేతల చుట్టూ తిరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హాట్టాపిక్గా మారింది.


