సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి వేళ వరుణుడు విజృంభించాడు. అల్పపీడన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో గత రాత్రి నుంచి వానలు దంచి కొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అధికార యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్లు జారీ చేశాయి.

తెలంగాణలో అర్ధరాత్రి దాటాక గట్టి వానలు కొడుతున్నాయి. ఇటు రాజధాని హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గల్లీలు, రహదారులు జలమయం అయ్యాయి. ఇవాళ, రేపు పలు జిల్లాలోనూ భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

అటు ఏపీలోనూ అల్పపీడన ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎన్టీఆర్, మన్యం, అల్లూరి పోలవరం, కాకినాడ, గుంటూరు, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇంకా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.


