సభా వేదికపై సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ధన్పాల్ సూర్యనారాయణ, బిగాల గణేశ్, బొగ్గారపు దయానంద్, మల్రెడ్డి రంగారెడ్డి, టీజీ వెంకటేశ్, మంత్రి వివేక్, గణేశ్ గుప్తా, మధుయాష్కీ, వేం నరేందర్, ప్రకాశ్ గౌడ్, నవీన్ యాదవ్
మిగులు బడ్జెట్ రోశయ్య పుణ్యమే.. ఆవేశం తగ్గించుకొని..
అనుభవంతో ముందుకెళ్తే పైకి వస్తావని నన్ను ఆశీర్వదించారు
ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణ శంకుస్థాపనలో సీఎం రేవంత్రెడ్డి
ఉప్పల్(హైదరాబాద్): ‘ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవారు. చాలామంది పేదలున్నా, ఆత్మగౌరవం కోసం పేదలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్ట పడరు’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి రేవంత్రెడ్డి మాట్లాడుతూ కష్టాలు, బాధలు ఉన్నా సమాజంలో గౌరవం కోసం జీవించేవారు ఆర్య వైశ్యులని, తానెప్పుడూ వారి శ్రేయోభిలాషినేనని చెప్పారు. ప్రపంచంలో ఉన్నవి రెండే వృత్తులని అవి వ్యవసాయం, వ్యాపారాలేనన్నారు.
మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి నుంచి మొదలు కోట్ల విజయభాస్కర్రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు గల్లాపెట్టె నిర్వహణ బాధ్యతను ఆర్యవైశ్యులకే అప్పగించారని గుర్తు చేశారు. జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పాటు అయ్యేనాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉందంటే ఆనాటి ఆర్థికమంత్రి రోశయ్యే కారణం అన్నారు. శాసనమండలిలో దూకుడుగా తాను మాట్లాడితే రోశయ్య నన్ను పిలిచి ఆవేశం తగ్గించుకొని అనుభవంతో ముందుకు వెళ్తే పైకి వస్తావని ఆశీర్వదించారన్నారు. రోశయ్య విమర్శించే వారు కాదు..తిట్టేవారు కాదు..చురకలు వేసేవారు అని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా రోశయ్య గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేశామన్నారు.
ప్రపంచ స్థాయి నాయకుడు ఒకే ఒక్కరు మహాత్మాగాంధీ
ప్రపంచస్థాయి నాయకుడు ఒకే ఒక్కరు మహాత్మాగాంధీ అని, ఏ దేశం పోయినా ఆయన గొప్పతనం తెలియనివారు ఉండరని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదిగిన ఆర్యవైశ్య బిడ్డ మహాత్మాగాంధీ అన్నారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం గర్వ కారణమని చెప్పారు. పొట్టి శ్రీరాములు పోరాటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు.
దేశ సమగ్రత కోసం మహాత్మాగాంధీ ప్రాణాలు ఇస్తే, పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి, మాజీమంత్రి టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బండారి లక్ష్మారెడ్డి, ప్రకాశ్గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, నవీన్యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, మాజీఎంపీ మధు యాష్కీ, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ పరమేశ్వర్రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


