కందనూలు: వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తమ బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిన ఉదంతం తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లికి చెందిన మహమ్మద్ కరీం (43), సలీమాబేగం నాగర్కర్నూల్లో నివాసం ఉంటున్నారు.
సలీమాబేగం తనకు మరిది వరుసైన నాగపూర్ గ్రామానికి చెందిన గౌస్పాషాతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీన్ని గుర్తించిన కరీం తన భార్యను మందలించగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో 9న వాట్సాప్ కాల్లో రాత్రికి కరీంను చంపుతానని సలీమాబేగంకు గౌస్పాష చెప్పాడు. పదునైన కత్తి, చేతి గ్లౌజులు తీసుకొని రాత్రి 2.30 గంటల సమయంలో గౌస్పాష.. కరీం ఇంటికి వెళ్లి నిద్రలేపాడు. నిద్రమత్తులో ఉన్న కరీం డోర్ తీయగా కత్తితో గౌస్పాష అతనిపై దాడి చేసి చంపి పరారయ్యాడు.


