వేర్వేరు సందర్భాల్లో సామూహిక అత్యాచారానికి గురైన మైనర్
మత్తు చాక్లెట్లు తినిపించి, గంజాయి, మద్యం తాగించి అఘాయిత్యం
ఇటీవల కూడా వేధింపులు.. చివరకు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు!
మొత్తం 8 మంది నిందితుల పేర్లు వెలుగులోకి.. మరికొందరు నిందితులు ఉన్నారని అనుమానం
పోలీసుల అదుపులో యువకులు?
అల్వాల్: ఇన్స్టాగ్రామ్ పరిచయం ఓ మైనర్ బాలికను కాటేసింది. ఆమె జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. అనేకమార్లు లైంగిక దాడికి గురయ్యింది. వేర్వేరు ఘటనల్లో మత్తు మందు కలిపిన చాక్లెట్లు తినిపించడంతో పాటు, మద్యం, గంజాయి, సిగరెట్లు తాగించిన పలువురు నిందితులు..అమానుషంగా ప్రవర్తించారు. బాలికను వెంటాడారు. లైంగికంగా వేధించారు. చివర్లో ఎలాగో తప్పించుకుని బయటపడిన ఆమె ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ ఘోర సామూహిక అత్యాచారాల పరంపర వెలుగులోకి వచ్చింది. ఇందులో 8 మంది నిందితులు పేర్లు బయటకు రాగా, మరికొందరు కూడా ఈ లైంగిక దాడుల పర్వంలో పాల్గొన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
10వ తరగతి చదువుతుండగా..
అల్వాల్కు చెందిన ఓ బాలిక ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది. 10వ తరగతి చదువుతున్నప్పుడు జెర్నీ వరుణ్ ఇన్స్ట్రాగామ్లో పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో అతనితో స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకున్న వరుణ్ ఓ రోజు కారులో తీసుకెళ్లి మత్తు మందు కలిపిన చాక్లెట్లు తినిపించాడు. ఆమె మత్తులోకి వెళ్లడంతో కారులోనే పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత జెర్నీ వరుణ్ పరిచయం చేసిన మరో వ్యకి రోమల వరుణ్ బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు మద్యం, సిగరెట్లు, గంజాయి అలవాటు చేశాడు. ఈ క్రమంలో బాలికను కొంపల్లిలోని ఓ నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా ఈ నెల 9న కూతురి వ్యవహారశైలిని ప్రశ్నించిన ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. నేరుగా బొల్లారం రైల్వేస్టేషన్కు చేరుకుంది.
అక్కడికి రమ్మని తనకు పరిచయస్తుడైన నీరజ్ అనే యువకుడిని పిలిచింది. అతను తన స్నేహితుడైన విక్కీని స్టేషన్కు రమ్మని చెప్పాడు. ఇద్దరూ కలిసి బాలికతో గంజాయి కలిపిన సిగరెట్లు తాగించడంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఆమెను స్టేషన్కు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ నీరజ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్లిన విక్కీ అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత విక్కీ తన స్నేహితుడైన నిఖిల్తో కలిసి బాధితురాలిని స్కూటర్పై ఎక్కించుకుని దూలపల్లికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే ఉన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి నల్లటి నూనె లాంటి పదార్థాన్ని సిగరెట్లోకి ఎక్కించి బలవంతంగా తాగించారు. తర్వాత సమీపంలోని ఓయో రూమ్కు తీసుకెళ్లి అక్కడ గంజాయి తాగించారు. అక్కడ నిఖిల్ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేశారు. తర్వాత హోటల్ రూమ్ నుంచి బాలికను బొల్లారంలోని విక్కీ ఇంటికి తీసుకువచ్చారు. అక్కడ విక్కీతో పాటు నిఖిల్ మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె సెల్ఫోన్ లాక్కొని అక్కడే బంధించారు.
ఒకసారి తప్పించుకున్నా వెంటాడి..
ఈ నెల 10న మైనర్ బాలిక అక్కడ్నుంచి తప్పించుకొని బొల్లారం రైల్వే స్వేషన్కు చేరుకుంది. అయితే ఆమెను వెంటాడిన విక్కీ, తన స్నేహితుడు గణేష్తో పాటు అక్కడికి చేరుకున్నాడు. మళ్లీ ఆమెకు గంజాయి తాగించారు. రైల్లో మేడ్చల్ తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ నిలిచి ఉన్న రైలు బోగిలోకి తీసుకెళ్లి విక్కీ, గణేష్ ఇద్దరూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ముగ్గురూ కలసి మరో రైలులో మల్కాజిగిరి వైపు వెళ్తుండగా బాలిక ఇతరుల సహాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమెను ఆటోలో ధూల్పేట వైపు తీసుకెళ్లారు. అయితే ఆమె గట్టిగా కేకలు వేయడంతో మధ్యలోనే వదిలేసి పరారయ్యారు. అనంతరం మరో ఆటోలో ఇంటికి చేరుకున్న బాలిక కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. దీంతో బాలికతో కలిసి కుటుంబసభ్యులు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జెర్రీ వరుణ్, రోమల వరుణ్, నీరజ్, విక్కీ, నిఖిల్, గణేష్, ఇతరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.


