హైపవర్ విచారణ కమిటీకి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్న పత్రాల లీకేజీపై జంతర్మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో మహిళలపై జరిగిన లైంగికపరమైన దాడులకు ప్రాధాన్యమివ్వాలని సుప్రీంకోర్టు హైపవర్ విచారణ కమిటీకి సోమవారం స్పష్టం చేసింది. జూలై 20న జరిగిన ఆందోళనల్లో మహిళలపై లైంగికంగా దాడులు జరిగాయని, అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై సూమోటోగా విచారించాలని సీనియర్ న్యాయవాది శోభా గుప్తా చేసిన విజ్ఞప్తిపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది.
బాధిత మహిళలు నేరుగా ఫిర్యాదులు చేసేందుకు వీలుగా జిల్లా జడ్జి లేదా తత్సమానమైన అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని కూడా శోభా గుప్తా బెంచ్ను కోరారు. సీజేఐ మాట్లాడుతూ... ఆందోళనకారులపై లైంగిక దాడులు జరిగినట్లుగా వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యమిచ్చి హైపవర్ ఎంక్వైరీ కమిటీ విచారణ జరుపుతుందని స్పష్టం చేశారు. గత వారం తాము చేసిన ఆదేశాల్లోనూ ఈ విషయాన్ని స్పష్టం చేశామని, మధ్యంతర నివేదిక దాఖలు చేయమని హైపవర్ ఎంక్వైరీ కమిటీకి చెప్పామని సీజేఐ వివరించారు. జంతర్మంతర్ అల్లర్ల సమయంలో పోలీసుల అతి చర్యలపై విచారణకు సుప్రీంకోర్టు ఆగస్టు 20న హైపవర్ ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


