ప్రైవేట్ సంస్థలకే కీలక బాధ్యతలు
ఎస్ఎస్ఎల్వీ టెక్నాలజీ, ఉత్పత్తి హక్కులు ఇప్పటికే బదలాయింపు
తదుపరి దశలో పీఎస్ఎల్వీ, ఎల్వీఎం–3 తయారీ కూడా..
ఇకపై పరిశోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపైనే ఇస్రో దృష్టి
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇకపై రాకెట్, శాటిలైట్ల తయారీ వంటి కార్యకలాపాల నుంచి ఇస్రో క్రమంగా తప్పుకోనుంది. ఈ బాధ్యతలను ప్రైవేట్ అంతరిక్ష సంస్థలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశో«ధనా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే దిశగా ఇస్రో శాస్త్రీయ ప్రయోగాలు, ప్రత్యేక మిషన్లపై మరింత దృష్టిసారించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మార్పు ఇస్రోలో ఇప్పటికే ప్రారంభమైంది.
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి
చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) సాంకేతికత, ఉత్పత్తి హక్కులను బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు బదిలీ చేశారు. ఆ తదుపరి దశలో భారత్కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచి్చన పీఎస్ఎల్వీ, ఇస్రో బాహుబలి రాకెట్గా పేరుగాంచిన ఎల్వీఎం–3 రాకెట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రైవేట్ రంగానికి బదిలీచేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈసారి ప్రభుత్వ రంగ సంస్థలకు బదులుగా ప్రైవేట్ పరిశ్రమలకే అవకాశం కల్పించనున్నట్లుగా ఇన్స్పేస్ చైర్మన్ డాక్టర్ పవన్ గోయెంకా ఇటీవల తెలిపారు. ఇకపై ఇస్రో ఒక తయారీ సంస్థగా కాకుండా ప్రధాన పరిశోధన, అభివృద్ధి సంస్థగా పనిచేయనుంది.
సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ మిషన్లు, ప్రత్యేక ఉపగ్రహాలు, అధునాతన అంతరిక్ష మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టిసారించనుంది. ఒక సాంకేతికత అభివృద్ధి చెంది వాణిజ్యపరంగా వినియోగించేందుకు సిద్ధమైన తరువాత దాన్ని ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేస్తామని గోయెంకా తెలిపారు. ఇప్పటివరకు ఇస్రోకు చెందిన 120 సాంకేతికతలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేసినట్లుగా కూడా ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్రో తమిళనాడులో సుమారు వెయ్యి కోట్లతో నిర్మింస్తున్న కొత్త ప్రయోగ వేదిక నిర్వహణ బాధ్యతలను కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి సంబం«ధించిన ఆపరేటర్ను రాబోయే నాలుగైదు నెలల్లో ఖరారు చేసే అవకాశముందని కూడా తెలిపారు.
అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పెంపే లక్ష్యం
భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతమున్న సుమారు 8 బిలియన్ డాలర్ల నుంచి 2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే అంతరిక్ష సాంకేతికతను ఇతర రంగాల్లో విస్తృతంగా వినియోగించడం, అంతర్జాతీయ మార్కెట్లో భారత సంస్థల విస్తరణ కీలకమని గోయెంకా తెలిపారు. రక్షణశాఖ ఇప్పటికే ప్రైవేట్ సంస్థలకు 31 ఉపగ్రహాల తయారీకి ఆర్డర్ ఇచ్చిందని, ఇదే కార్యక్రమంలో భాగంగా మరో 21 ఉపగ్రహాలను ఇస్రో తయారు చేయనుందని ఆయన వివరించారు.


