తమిళనాడుకు సుప్రీంకోర్టు షాక్‌ | Cauvery water dispute supreme court asks Tamil Nadu to approach CWMA | Sakshi
Sakshi News home page

తమిళనాడుకు సుప్రీంకోర్టు షాక్‌

Aug 24 2026 3:49 PM | Updated on Aug 24 2026 4:13 PM

Cauvery water dispute supreme court asks Tamil Nadu to approach CWMA

సాక్షి, ఢిల్లీ: కావేరీ నదీ జలాల విడుదల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీటి వాటా విడుదలలో ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే వాటిని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) ముందే లేవనెత్తాలని తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కర్ణాటక నుంచి తమకు రావాల్సిన అదనపు నిష్పత్తి నీటి వాటాను విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.

వివరాల్లోకి వెళితే..  కావేరీ నీటి నియంత్రణ కమిటీ (CWRC) ఆగస్టు 12 నుండి 15 రోజుల పాటు ప్రతిరోజూ తమిళనాడుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కూడా సమర్థించింది. అయితే వాటా న్యాయపరంగా తమకు దక్కడం లేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ, తమకు దక్కాల్సిన సరైన నిష్పత్తిలో నీరు అందడం లేదని ధర్మాసనానికి తెలిపారు. దురదృష్టవశాత్తూ క్షేత్రస్థాయిలో నీటి విడుదల సక్రమంగా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం  ఈ అంశాన్ని సంబంధిత అథారిటీ (CWMA) సమావేశంలోనే లేవనెత్తాలని సుప్రీంకోర్టు సూచించింది.

గత విచారణలో కర్ణాటక ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ సమర్పించిన నీటి విడుదల వివరాల చార్ట్‌ను ధర్మాసనం ప్రస్తావించింది. ఆ చార్ట్ ప్రకారం CWMA ఆదేశాల మేరకే తమిళనాడుకు నీటిని విడుదల చేసినట్లు కనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. 

దీనిపై వైద్యనాథన్ స్పందిస్తూ, నిష్పత్తి ప్రకారం నీటిని విడుదల చేయడానికి CWMA దిశా నిర్దేశం చేయడం లేదని, దీనివల్ల తమిళనాడులోని రైతులకు తాము ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేకపోతున్నామని, కానీ కర్ణాటక మాత్రం తమ రైతులకు నీటిని ఇచ్చుకుంటోందని వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేస్తూ, ఆ రోజు నాటికి తాజా పరిస్థితిపై నివేదిక (అప్‌డేటెడ్ స్టేటస్) సమర్పించాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది.

అంతకుముందు ఆగస్టు 17న జరిగిన విచారణలో కూడా CWMA ఆదేశాలను కర్ణాటక తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, వర్షపాతం తక్కువగా ఉన్న ఈ సంవత్సరంలో తమకు రావలసిన న్యాయమైన వాటా దక్కడం లేదు. CWRC కేటాయించిన పరిమాణం కంటే, పొరుగున ఉన్న కర్ణాటక విడుదల చేసిన నీటి పరిమాణం చాలా తక్కువగా ఉందని తమిళనాడు తన పిటిషన్‌లో పేర్కొంది.

జూలై 28న జరిగిన CWRC సమావేశంలో జూలై 29 నుండి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించినప్పటికీ, జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు బిలిగుండ్లు వద్ద కేవలం 158 నుండి 550 క్యూసెక్కుల లోపే నీరు అందిందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.

తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని కేఆర్‌ఎస్, కబిని, హారంగి, హేమవతి జలాశయాలలో మొత్తం నీటి నిల్వ 77.537 టీఎంసీలుగా ఉంది. కాబట్టి తమిళనాడుకు చెందాల్సిన వాటాను నిష్పత్తి ప్రకారం విడుదల చేయడానికి కర్ణాటకకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.

కర్ణాటకలోని కేఆర్‌ఎస్, కబిని డ్యామ్‌ల క్యాచ్‌మెంట్ ఏరియాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, బిలిగుండ్లు వద్ద తమిళనాడుకు అందాల్సిన నిష్పత్తి నీరు 26.954 టీఎంసీలుగా ఉండాలని పేర్కొంది. దీనితో పోలిస్తే కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కేటాయించిన 4.536 టీఎంసీలు చాలా తక్కువని తమిళనాడు ఆరోపించింది. 

మొత్తంగా కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు ఇవ్వాల్సిన 26.954 టీఎంసీల న్యాయమైన వాటాను పంచుకోవడంలో విఫలమైందని తమిళనాడు ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement