‘అద్దాల’ టెండర్లలో మాయాజాలం | Amaravati Secretariat: Tender Issued for Third Time to Install Glass Panels | Sakshi
Sakshi News home page

‘అద్దాల’ టెండర్లలో మాయాజాలం

Sep 14 2026 5:16 AM | Updated on Sep 14 2026 5:16 AM

Amaravati Secretariat: Tender Issued for Third Time to Install Glass Panels

శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలు అమర్చే పనులకు ముచ్చటగా మూడోసారి టెండర్‌ నోటిఫికేషన్‌

కాంట్రాక్టు విలువ జీఏడీ టవర్‌కు రూ.442.06 కోట్లు.. 1, 2 టవర్లకు రూ.909.88 కోట్లు.. 3, 4 టవర్లకు రూ.725.45 కోట్లు  

ఆల్మెక్‌ ఫెసాడ్‌ సంస్థ కొటేషన్, చైనా మర్చంట్స్‌ బ్యాంక్‌ హెడ్‌ క్వార్టర్ట్స్‌ పనుల ఆధారంగా అద్దాల పనులకు ఎస్‌ఎస్‌ఆర్‌ తయారు చేసిన బీవోసీఈ 

అద్దాలు బిగించే పనులకు జీఎస్టీతో కలిపి చదరపు మీటరుకు రూ.80,892 ఖరారు 

తాము కేవలం సీఆర్‌డీఏ అందించిన సమాచారం ఆధారంగానే ఈ ధరను ఖరారు చేశామని స్పర్టీకరణ 

ఈ లెక్కన చూసుకుంటే ఐదు టవర్లకు 2,35,092.75 మీటర్ల మేర అద్దాలు బిగించే పనుల వ్యయం రూ.1,901.71 కోట్లే 

కానీ.. జీఎస్టీతో కలిపి రూ.2455.22 కోట్ల అంచనా వ్యయంతో ఏజీఐసీఎల్‌ టెండర్లు 

అంటే.. అంచనా వ్యయాన్ని రూ.553.51 కోట్లు పెంచేసిన వైనం 

అధిక ధరకు అప్పగించి.. పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్‌గా రాబట్టుకునే వ్యూహం  

సాక్షి, అమరావతి: శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలను అమర్చే పనుల టెండర్లలో ముఖ్యనేత మాయాజాలానికి ఇదో నిదర్శనం. బోర్డ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్స్‌ (బీవోసీఈ) ఆమోదించిన ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌)ను తుంగలో తొక్కి అంచనా వ్యయాన్ని రూ.553.51 కోట్లు పెంచేసి ఐదు టవర్లకు అద్దాలను అమర్చే పనులకు ఆగస్టు 4న ఏజీఐసీఎల్‌ (అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) టెండర్లు పిలిచింది. టెండర్‌లో జాయింట్‌ వెంచర్లు బిడ్‌లు దాఖలుకు అర్హత లేదంటూ నిబంధన పెట్టింది. కానీ.. టెండర్‌లో పనులు దక్కించుకున్నాక 50 శాతం పనులు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించింది. 

పరస్పర విరుద్ధమైన ఈ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటే.. అధిక మొత్తంలో కమీషన్‌ ఇచ్చే సంస్థకు పనులు అప్పగించేందుకే వాటిని పెట్టారని అప్పట్లోనే నిపుణులు పేర్కొన్నారు. ఆ టెండర్లు రద్దు చేసి.. ఆ తర్వాత ఆ పనులకు ఆగస్టు 31న ఏడు రోజుల స్వల్పకాలిక వ్యవధితో రెండోసారి టెండర్లు పిలిచింది. ఆ టెండర్లను ఈ నెల 9న రద్దు చేసింది. సింగిల్‌ బిడ్‌లు దాఖలు కావడంతో తొలిసారి, రెండోసారి టెండర్లు రద్దు చేసినట్టు చెబుతున్నారు. 

వాటికి ముచ్చటగా మూడోసారి ఈ నెల 11న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 15 నుంచి బిడ్‌లు దాఖలు చేయవచ్చని పేర్కొంది. బిడ్‌ల దాఖలు తుది గడువు ఈ నెల 22. అదే రోజున టెక్నికల్‌ బిడ్‌ తెరిచి అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థల దాఖలు చేసిన ఆర్థిక బిడ్‌లను తెరిచి టెండర్లు ఖరారు చేస్తామని పేర్కొంది. మొద టి, రెండోసారి సింగిల్‌ బిడ్‌ దాఖలు కావడంతో వాటిని రద్దు చేసి ఏజీఐసీఎల్‌ మూడోసారి సింగిల్‌ బిడ్‌ దాఖలైనా ఆమోదించేందుకు సిద్ధమైంది.

ఎస్‌ఎస్‌ఆర్‌ తుంగలోకి..
అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగంగా శాశ్వత సచివాలయం పేరుతో ఐదు టవర్ల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. డయాగ్రిడ్‌ విధానంలో 39 అంతస్తులతో నిర్మీస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మీస్తున్న మరో టవర్‌కు అద్దాలను అమర్చేలా పోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ సంస్థ డిజైన్‌లు రూపొందించింది. టవర్లకు గ్లాసింగ్, క్లాడింగ్‌(అత్యధిక ఉష్ణోగ్రతను, శబ్ద కాలుష్యాన్ని తట్టుకునే డబుల్‌–గ్లేజ్డ్‌ అద్దాలను అమర్చడం), క్రౌన్, అట్రియం(భవనాల పైభాగంలో ఉండే శిఖరం నిర్మాణం, విశాలమైన గ్లాస్‌–రూఫ్‌ సెంట్రల్‌ అట్రియమ్‌), కానోపి, స్కైలైట్‌(ప్ర«దాన ప్రవేశ ద్వారాల వద్ద టెన్షన్‌–రాడ్‌ స్టీల్‌ కానోపిలు, సహజ వెలుతురు కోసం స్కైలైట్లు), పీవీ ప్యానెల్స్‌ (భవనం వెలుపల సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పర్యావరణ అనుకూల ఐజీబీసీ ప్లాటినమ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాల ప్యానెళ్లు), బీఎమ్‌యూ (ఎత్తైన టవర్ల గ్లాస్‌ను శుభ్రం చేయడానికి, నిర్వహించడానికి ఉపయోగించే ఆటోమేటెడ్, రూఫ్‌–మౌంటెడ్‌ టెలిస్కోపిక్‌ క్రేన్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు) పనులు చేయాలి. 

వీటి అంచనా వ్యయం రూపొందించడానికి ఇప్పటివరకు ఎస్‌ఎస్‌ఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయలేదు. దీంతో ఎస్‌ఎస్‌ఆర్‌ ఖరారుకు అనుభవం ఉన్న సంస్థల నుంచి సీఆర్‌డీఏ కొటేష న్లు ఆహ్వానించింది. ముంబైకి చెందిన ఆల్మెక్‌ ఫెసాడ్, హైదరాబాద్‌కు చెందిన టీమ్‌ వర్క్‌ గ్లాస్‌ అండ్‌ అల్యూమినియం, బెంగళూరుకు చెందిన ఇంటెర్ని ఇంటర్నేషనల్‌ సంస్థలు కొటేషన్లు ఇచ్చాయి. 

అందులో ఆల్మెక్‌ ఫెసాడ్‌ సంస్థ తక్కువ ధరకు కోట్‌ చేసినట్టు సీఆర్‌డీఏ పేర్కొంది. శాశ్వ త సచివాలయం ఐదు టవర్లకు డిజైన్లు రూపొందించిన పోస్టర్‌ అండ్‌ పార్టనర్స్‌ సంస్థే.. చైనాలో షెన్‌జెన్‌లోని మర్చంట్స్‌ బ్యాంక్‌ హెడ్‌ క్వార్టర్స్‌ భవనాలను డిజైన్‌ చేసింది. ఆ భవనాలకు అద్దా లు అమర్చడానికి చేసిన వ్యయాన్ని.. ఆల్మెక్‌ ఫెసా డ్‌ కొటేషన్‌లో పేర్కొన్న ధరను పరిగణనలోకి తీసుకుని.. అన్ని పనులకూ జీఎస్టీతో కలిపి చదరపు అడుగుకు సగటున రూ.80,892గా బీవోసీఈ ఖరారు చేసింది. కానీ.. బీవోసీఈ ఖరారు చేసిన ఎస్‌ఎస్‌ఆర్‌ను తుంగలో తొక్కి అంచనా వ్యయా న్ని పెంచేసి ఏజీఐసీఎల్‌ టెండర్లు పిలిచింది.

అంచనా వ్యయం రూ.553.51 కోట్లు పెంపు 
అద్దాలను అమర్చే పనులకు జీఏడీ టవర్‌కు రూ.522.15 కోట్లు (అంచనా వ్యయం రూ.442.06 కోట్లు+రూ.80.09 కోట్లు జీఎస్టీ రీయింబర్స్‌), 1, 2 టవర్లకు రూ.1,073.82 కోట్లు (అంచనా వ్యయం రూ.909.88 కోట్లు+రూ.163.94 కోట్లు జీఎస్టీ రీయింబర్స్‌), 3, 4 టవర్లకు రూ.859.25 కోట్లు (అంచ నా వ్యయం రూ.727.45 కోట్లు+ రూ.131.79 కోట్లు జీఎస్టీ రీయింబర్స్‌) వెరసి రూ.2,455.22 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఒప్పందం చేసుకున్న రోజు నుంచి 15 నెలల్లో వాటిని పూర్తిచేసి.. మరో 13 ఏళ్లు వాటిని నిర్వహించాలని ఏజీఐసీఎల్‌ షరతు విధించింది. ఐదు టవర్లలోనూ అన్నిరకాల అద్దాలు అమర్చే పనుల విస్తీర్ణం 2,35,092.75 చదరపు మీటర్లుగా లెక్కగట్టింది.

ఈ లెక్కన ఆ పనుల అంచనా వ్యయం జీఎస్టీతో కలిపి రూ.1,901.71 కోట్లే.. కానీ రూ.2,455.22 కోట్లతో ఏజీఐసీఎల్‌ టెండర్లు పిలిచింది. అంటే అద్దాలు అమర్చేందుకు చదరపు మీటరు ధర రూ.1,04,436.22 కావడం గమనార్హం. అంటే.. బీవోసీఈ ఖరారు చేసిన ఎస్‌ఎస్‌ఆర్‌ను బుట్టదాఖలు చేసినట్టు స్పష్టమవుతోంది. దీన్ని బట్టి చూస్తే అంచనా వ్యయాన్ని రూ.553.51 కోట్లు పెంచేశారు. ఎంపిక చేసిన సంస్థకే అధిక ధరలకు పనులు కట్టబెట్టి పెంచేసిన అంచనా వ్యయంతోపాటు భారీగా కమీషన్లు వసూలుకే ఈ టెండర్లలో ముఖ్యనేత మాయాజాలం చేస్తున్నారంటూ ఇంజినీరింగ్‌ నిపుణులు ఆరోపిస్తున్నారు.

ఈ దోపిడీ పర్వం వల్లే సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం రూ.10,670.47 కోట్లకు చేరుకుంది. ఐదు టవర్ల నిర్మీత ప్రాంతం 52,20,496 చదరపు అడుగులు. అంటే.. నిర్మాణ వ్యయం ఇప్పటికే చదరపు అడుగుకు రూ.20,439.58కు చేరుకున్నట్టు స్పష్టమవుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లోనూ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement