బెంగళూరు: లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జనతాదళ్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. బెంగళూరులోని పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ప్రజ్వల్ రేవణ్ణ ఉన్నారు. ఆగస్టు 11న క్రైమ్ బ్రాంచ్ అధికారులు జరిపిన ఆకస్మిక దాడిలో రేవణ్ణ మొబైల్ ఫోన్ వాడుతున్నట్లు గుర్తించారు. అలాగే.. ప్రజ్వల్ ఉంటున్న హై సెక్యూరిటీ బ్యారెక్ నుంచి ఛార్జర్, పెన్ డ్రైవ్, నోట్బుక్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్, పెన్ డ్రైవ్ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా.. ఫోన్లో డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు, పెన్ డ్రైవ్లో వెబ్ సిరీస్లు ఉన్నట్లు తేలింది.
ఫోన్లో వాట్సాప్, వీడియో కాల్స్ జరిగినట్లు కాల్ రికార్డుల పోలీసుల పరిశీలనలో తేలింది. పలువురు మహిళలతో సంప్రదింపులు జరిగినట్లు కూడా గుర్తించారు. బెంగళూరు సెంట్రల్ జైలులో 'వీఐపి' ఖైదీలకు అందుతున్న ప్రత్యేక సౌకర్యాల అంశంపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి.. ఆ లైంగిక దాడికి సంబంధించిన వీడియోలను సర్క్యులేట్ చేసిన కేసులో రేవణ్ణ గత ఏడాది దోషిగా తేలాడు.
హాసన్ జిల్లా హోళేనరసీపురలోని రేవన్న కుటుంబానికి చెందిన ఫామ్హౌస్లో డొమెస్టిక్ హెల్ప్గా పనిచేస్తున్న ఆ బాధితురాలు.. 2021 నుంచి ప్రజ్వల్ రేవణ్ణ తనపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆ దృశ్యాలను వీడియో రికార్డు చేసిన రేవణ్ణ.. ఎవరికైనా చెబితే ఆ వీడియోలను విడుదల చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. రేవణ్ణ సెల్ నుంచి ఫోన్ లభ్యం కావడంతో అధికారులు ఓ జైలు అధికారిని సస్పెండ్ చేసి దర్యాప్తునకు ఆదేశించారు. జైళ్లలో వ్యక్తిగత మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరికరాలను పూర్తిగా నిషేధించారు. కేవలం గట్టి నిఘా ఉన్న ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్లైన్లు, పబ్లిక్ కాల్ ఆఫీసులు, నిర్దేశిత వీడియో-కాలింగ్ సిస్టమ్ల ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ అనుమతిస్తారు.
ఇదీ చదవండి: భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే!


