పన్ను చెల్లింపుదారులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ | Supreme Court Delivers Key Verdict, Tax Assessments Cannot Be Reopened After ITSC Final Orders, Check Details Inside | Sakshi
Sakshi News home page

పన్ను చెల్లింపుదారులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్

Sep 17 2026 12:19 PM | Updated on Sep 17 2026 1:11 PM

Supreme Court Bars Tax Reassessment Win Taxpayers Settlement Commission Order

ఐటీ ఆఫీసర్ల ‘రీ-అసెస్మెంట్’కు చెక్!

ఇన్‌కమ్ టాక్స్ సెటిల్మెంట్ కమిషన్ (ఐటీఎస్‌సీ) తుది ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అదే అంశాన్ని లేదా పన్ను వివాదాన్ని అసెస్సింగ్ ఆఫీసర్లు (ఏఓ) మళ్లీ రీఓపెన్ చేసి పునపరిశీలించడం (రీఅసెస్‌మెంట్‌) చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్టసభలు (పార్లమెంట్) ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌లోని చాప్టర్ XIX-A రూపకల్పనలో ఇటువంటి చర్యలను ఏమాత్రం ఊహించలేదని కోర్టు తేల్చిచెప్పింది. జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం ‘అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ వర్సెస్ ఎం/ఎస్ ఒమాక్స్ లిమిటెడ్’ కేసులో పన్ను శాఖ దాఖలు చేసిన అప్పీలును కొట్టివేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

కేసు నేపథ్యం

రియల్ ఎస్టేట్ సంస్థ ఒమాక్స్ లిమిటెడ్ 2006-07 అసెస్‌మెంట్ సంవత్సరానికి గాను హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి సెక్షన్ 80-IB(10) కింద రూ.78.99 కోట్ల మినహాయింపు పొందింది. అనంతరం పన్ను వివాద పరిష్కారం కోసం కంపెనీ సెటిల్మెంట్ కమిషన్‌ను ఆశ్రయించగా 2008 మార్చిలో కమిషన్ తుది తీర్పునిస్తూ టాక్సబుల్ ఇన్‌కమ్‌ను ఖరారు చేసింది. అయితే, 2009 డిసెంబర్‌లో పన్ను శాఖ నిర్వహించిన సర్వే ఆధారంగా సెక్షన్ 148 కింద అసెస్సింగ్ ఆఫీసర్ రీఓపెన్ నోటీసులు ఇచ్చి, మినహాయింపులను నిరాకరిస్తూ రూ.65.65 కోట్లను అదనపు ఆదాయంగా చేర్చారు.

దీన్ని సవాలు చేస్తూ ఒమాక్స్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు రీఓపెనింగ్ నోటీసులను రద్దు చేసింది. పన్ను శాఖ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పన్ను శాఖ అప్పీలును తోసిపుచ్చింది.

ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

సెక్షన్ 245D(1) కింద సెటిల్మెంట్ దరఖాస్తును కమిషన్ ఆమోదించిన క్షణం నుంచే ఆ కేసుపై పూర్తి అధికార పరిధి కమిషన్‌కు మాత్రమే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ సెక్షన్ 143(2), 148, లేదా 154ల కింద అసెస్సింగ్ ఆఫీసర్లకు మళ్లీ స్వతంత్ర విచారణ అధికారాలు ఇస్తే సెటిల్మెంట్ కమిషన్‌కు రాజ్యాంగబద్ధంగా లభించిన తుది నిర్ణయ పునాదే దెబ్బతింటుంది. సెటిల్మెంట్‌లో మోసం లేదా వాస్తవాల సమర్పణలో తప్పుదోవ పట్టించారని పన్ను శాఖ భావిస్తే సెక్షన్ 245D(6) కింద సెటిల్మెంట్ కమిషన్‌నే ఆశ్రయించాలి తప్ప అసెస్సింగ్ ఆఫీసర్లు నేరుగా రీఓపెన్ చేయలేరని కోర్టు స్పష్టం చేసింది. ఒమాక్స్ విషయంలో పన్ను శాఖ దాఖలు చేసిన సెక్షన్ 245D(6) పిటిషన్‌ను కూడా కమిషన్ ఇప్పటికే తిరస్కరించిందని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.

ఇదీ చదవండి: నగవులు నిజమని నమ్మేదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement