టెహ్రాన్: తమ దేశం.. అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధంలో ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. యుద్ధ సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం ఎంతో కీలకమని ఆయన ఉద్ఘాటించారు. నేటి యుద్ధం కేవలం క్షిపణుల యుద్ధం మాత్రమే కాదు. మిలిటరీ దాడులతో ఇరాన్ జాతీయులను లొంగదీసుకోలేమని శత్రువు గ్రహించాడంటూ టెహ్రాన్లోని హై కౌన్సిల్ ఆఫ్ ది జుడీషియరీ సమావేశంలో పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. యుద్ధం పరిణామాలను ప్రజలు అంగీకరించాలన్న పెజెష్కియన్.. ప్రతిఘటనే ప్రస్తుత మార్గమన్నారు.
శత్రువు.. ఇరాన్పై హైబ్రిడ్ యుద్ధాన్ని మొదలుపెట్టాడన్న పెజెష్కియాన్.. యుద్ధ సమయంలో పరిపాలనా వ్యవస్థ ప్రాధాన్యతల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, సామాజిక ఆస్తులను పరిరక్షించడం ప్రధానమైనవని ఆయన స్పష్టం చేశారు. జూన్ 18న కుదిరిన అవగాహన ఒప్పందంతో సహా అమెరికాతో జరిగిన చర్చల్లో తమ ప్రభుత్వం ఇరాన్ జాతీయ హక్కులను, ప్రయోజనాలను పూర్తిస్థాయిలో కాపాడిందన్నారు.
కాగా, వాణిజ్య నౌకలను బెదిరించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా గత వారంలో అమెరికా ఇరాన్లోని దక్షిణ ప్రావిన్సులపై వరుస దాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్.. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ వంటి ప్రాంతీయ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు మరియు సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం తుది ఒప్పందానికి రావడానికి 60 రోజుల వ్యవధిలో చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి.
మరో వైపు, అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై మరో విడత దాడులను ప్రారంభించినట్లు ప్రకటించడంతో.. సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున దక్షిణ, మధ్య ఇరాన్లో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. దక్షిణ ప్రావిన్స్ హోర్మోజ్గాన్లోని బందర్ అబ్బాస్, సిరిక్, బందర్ లెంగే, ఖేష్మ్ కౌంటీలతో పాటు ఆగ్నేయ ప్రావిన్స్ సిస్తాన్ అండ్ బలూచిస్థాన్లోని చాబహార్, కొనారక్ కౌంటీలలో సోమవారం రాత్రి పేలుళ్లు జరిగాయి.


