భువనేశ్వర్: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు అలాగే ఢిల్లీలో సీజేపీ నిరసనకారులపై పోలీసుల చర్యలను తప్పుబట్టారు. ‘ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై నేను బీజేడీ ఎంపీలతో ఇప్పుడే సమావేశం నిర్వహించాను. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఎంతో మంది యువ విద్యార్థులపై హింసాత్మక దాడి జరిగింది. బీజేడీ ఎంపీలు వారిని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు... నేను రేపు ఉదయం ముఖ్యమైన పనుల నిమిత్తం భువనేశ్వర్కు వెళ్లాలి. మా ఎంపీలు అన్ని పరిణామాలను పరిశీలిస్తున్నారు. విద్యామంత్రి రాజీనామా చేయాలా వద్దా అని కూడా నన్ను అడిగారు... ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేయాలని నేను భావిస్తున్నాను’ అని నవీన్ పట్నాయక్ అన్నారు.
సోమవారం ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 118 మందికి పైగా పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 60 మందికి పైగా నిరసనకారులు గాయాలపాలయ్యారు. హింస, రాళ్లు రువ్వడం, విధ్వంసాలకు సంబంధించి పోలీసులు ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్నవారిని గుర్తించడానికి 250కి పైగా వీడియోలను పరిశీలిస్తున్నారు. పోలీసుల చర్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు
కాగా శరద్ పవార్, ఎంపి సుప్రియా సూలేలు సీజేపీ నిరసన కొనసాగిస్తున్న జంతర్ మంతర్ నిరసన ప్రదేశానికి వెళ్లి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్కు మద్దతు ప్రకటించారు. శరద్ పవార్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ, ‘నీట్ పరీక్షలో పేపర్ లీక్ నేపథ్యంలో, ఢిల్లీలోని జంతర్ మంతర్లో విద్యార్థులు నిరాహార దీక్ష, నిరసన చేపట్టారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు తగనిది. నిరసన ప్రదేశాన్ని సందర్శించి, విద్యార్థులను కలుసుకున్నాను. ఆందోళనలో గాయపడిన వారి గురించి ఆరా తీశాను. వారి డిమాండ్ల గురించి కూడా వివరంగా తెలుసుకున్నాను’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు: శశి థరూర్


