దళంలోనే వేధింపులు.. నరకం చూశా | Maoist Leaders Wife Surrenders And Gets Reward Of ₹25 Lakh, Says I Saw Hell Inside The Squad | Sakshi
Sakshi News home page

దళంలోనే వేధింపులు.. నరకం చూశా

Jul 22 2026 9:05 AM | Updated on Jul 22 2026 10:08 AM

I Saw Hell Inside The Squad: Maoist Leaders Wife Surrenders

ఒకప్పుడు అడవుల్లో తుపాకీ పట్టుకుని తిరిగింది.. మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది.. కానీ ఇప్పుడు అదే దళాన్ని వీడి పోలీసుల ఎదుట లొంగిపోయింది. కారణం.. బయటి శత్రువులు కాదు.. సంస్థలోనే ఎదురైన వేధింపులు, అనుభవాలేనని ఆమె చెప్పడం సంచలనంగా మారింది.

ఝార్ఖండ్‌లోని గిరిడీహ్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన మహిళా నేత అనిత కిస్కు అలియాస్‌ బబితా పోలీసుల ఎదుట లొంగిపోయారు. రూ.25 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు అగ్రనేత అజయ్‌ మహతో అలియాస్‌ టైగర్‌ భార్య అయిన ఆమె.. దళంలో కొనసాగిన సమయంలో ఎదురైన వేధింపులు, గ్రామస్తులపై జరుగుతున్న హింస తనను తీవ్రంగా కలచివేశాయని వెల్లడించారు.

భర్త అరెస్ట్‌ తర్వాతే..
అనిత లొంగుబాటు వెనుక ఆమె భర్త అరెస్ట్‌ కీలక పరిణామంగా మారింది. మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఉన్న అజయ్‌ మహతోను ఝార్ఖండ్‌ పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారు. పారస్నాథ్‌ ప్రాంతంలో ఏరియా కమాండర్‌గా పనిచేసిన అజయ్‌పై హత్యలు, ఐఈడీ పేలుళ్లు, భద్రతా బలగాలపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి తీవ్ర కేసులు నమోదయ్యాయి. అతనిపై వివిధ జిల్లాల్లో 240కి పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. భర్త అరెస్ట్‌ అనంతరం అనిత కూడా హింసాత్మక మార్గాన్ని వీడి సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సాంస్కృతిక కార్యక్రమం నుంచి..
బొకారో జిల్లాకు చెందిన అనిత కిస్కు వయసు సుమారు 30 ఏళ్లు. నాలుగో తరగతి వరకు చదువుకున్న ఆమెకు 2009లో ఓ సాంస్కృతిక కార్యక్రమం సందర్భంగా మావోయిస్టు సంస్థతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా దళంలో చేరిన ఆమె.. 2017లో అడవిలోనే అజయ్‌ మహతోను వివాహం చేసుకున్నట్లు తెలిపింది. పారస్నాథ్‌ జోన్‌, లుగు హిల్స్‌, జుమ్రా హిల్స్‌, కోల్హాన్‌ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో ఆమె చురుగ్గా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

“గ్రామాల్లో భయాన్ని సృష్టించాల్సి వచ్చేది”
దళంలో ఉన్న సమయంలో తనకు గ్రామాల్లో భయ వాతావరణం సృష్టించడం, లెవీ వసూళ్లు వంటి పనులు అప్పగించారని అనిత వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అయితే కాలం గడిచేకొద్దీ మావోయిస్టు సంస్థలోని అంతర్గత వ్యవహారాలు, సీనియర్‌ నేతల వ్యవహారశైలి, సాధారణ ప్రజలపై జరుగుతున్న దాడులు తనను కలచివేశాయని ఆమె పేర్కొన్నారు. దీనికి తోడు దళ సభ్యుల నుంచే వేధింపులు ఎదురయ్యాయని చెప్పారు. గ్రామస్తులపై అనవసరంగా హింసకు పాల్పడటం, కార్యకర్తలపై ఒత్తిడి పెరగడం తనలో అసంతృప్తిని పెంచాయని.. చివరకు ఆ జీవితం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

15 కేసుల్లో నిందితురాలు
అనిత కిస్కుపై కూడా పలు తీవ్ర కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్య, దోపిడీ, పేలుడు పదార్థాల చట్టం, యూఏపీఏ, ఆయుధాల చట్టం కింద మొత్తం 15 కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. జార్ఖండ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నయీ దిశా – ఏక్‌ నయీ పహల్‌’ పునరావాస పథకం ద్వారా ఆమెను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

మావోయిస్టులకు పోలీసుల పిలుపు
అనిత లొంగుబాటు గిరిడీహ్‌, బొకారో, కోల్హాన్‌, సింగ్‌భూమ్‌ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద ఎదురుదెబ్బ అని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికైనా హింసా మార్గాన్ని వీడి మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని అధికారులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement