న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాస ముట్టడికి యత్నించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు సీనియర్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయ దుమారం రేపింది. ఈ పోలీసు చర్యను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలను, వారి డిమాండ్లను లేవనెత్తే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు లోక కల్యాణ్ మార్గ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియం, మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లకు తరలించి, ఆ తర్వాత విడుదల చేశారు. మరోవైపు 2014 నుంచి దేశవ్యాప్తంగా పరీక్షా పత్రాలు లీకవుతున్నాయని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న విద్యాశాఖ మంత్రి తన బాధ్యత విస్మరించారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: భీమ్ ఆర్మీ టికెట్పై అభిజీత్ దిప్కే పోటీ?


