శతకనీతి
రెండు పదాల ఈ చిన్న సలహా పాటించకపోతే జీవితం ఎన్నో మలుపులతో కలచి వేస్తుంది, సంతోషాన్ని కబళిస్తుంది.. తాత్కాలికం, క్షణికం అయినా కోపం శాశ్వతంగా బంధాల్ని తెంపివేస్తుంది..స్నేహన్ని చెడగొడుతుంది, చుట్టరికాలు చెడిపోతాయ్.. మనుషుల్ని దూరం చేస్తుంది. మమతల్ని చంపివేస్తుంది. ఆరోగ్యం మటు మాయం అయిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కోపం వలన వచ్చే కష్టనష్టాలు బేరీజు వేసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే కోపం గూర్చి ఎన్నో శతకాల్లో నిక్కచ్చిగా, స్పష్టంగా చెప్పారు... కోప్పడకుండా చదవండి.
‘తన కోపమే తన శత్రువు
తన శాంతియె తనకు రక్ష దయ చుట్టంబౌ
దన సంతోషమే స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’
ఎన్నో సందర్భాలలో ఈ పద్యం వింటాం.. వేరే వివరణ అవసరం లేదు. కోపమే శత్రువు, శాంతమే రక్ష.. సంతోషం స్వర్గం బాధే నరకం... అన్నీ మనలోనే ఉన్నాయి ఈ పద్యంలోనే దయా గుణాన్ని అంటే ఇబ్బంది ఉంటే ఆదుకునే వాడే చుట్టం అని చె΄్తాడు. అందుకునే కాబోలు ‘అక్కరకు రాని చుట్టము... గ్రక్కున విడువంగ వలయు ‘ అని సలహా ఇస్తాడు బద్దెన కవి.
వేమన కోపం గురించి అత్యధికంగా చెప్పాడు
కోపము దుఃఖమునకు మూలము
కోపము శత్రుభయంకరము
కోపము కీర్తి నశింపజేయురా
కోపము వదలిన సుఖియైతివిరా వేమా!
అర్థం: కోపమే దుఃఖానికి మూలం. కోపం వల్ల శత్రువులు పెరుగుతారు. కీర్తి నాశనమవుతుంది. కోపం వదిలితేనే సుఖపడతావు.
మరో పద్యం..
కోపము వచ్చినప్పుడు కుయుక్తుల వచ్చురా
కోపము వచ్చినప్పుడు కూటమి చెడురా
కోపము వచ్చినప్పుడు కులమెల్ల చెడురా
కోపము వదలరా వేమా!
సుమతి శాంతంగా ఉండమని చెప్పాడు
కోపము పాపమునకు మూలము
కోపము దుఃఖమునకు మూలము
కోపము అధోగతికి మూలము
కోపము వదలి సుఖముండుము సుమతీ!
అర్థం: కోపమే అన్ని పాపాలకు, దుఃఖాలకు, అధోగతికి కారణం. అందుకే కోపం వదిలి సుఖంగా ఉండు. భర్తృహరి సుభాషిత శతకం – ఏనుగు లక్ష్మణకవి చేసిన అనువాదం
పద్యం
క్షమయా భూషితః పురుషః క్రోధేన భూషితో నరః
నీచోపచారైః నరకం వ్రజేత్ ఉత్తమో నరకాత్ పరమ్
తెలుగు అనువాదం
ఓర్పుతో భూషితుడైన నరుడు ఉత్తముడు కోపముతో నుండు నరుడు నీచుడు
నీచుడు నరకమునకు పోవును ఉత్తముడు స్వర్గమునకు పోవును
కోపము కామము లోభము మదము మాత్సర్యము
ఈ పంచ మహాపాములు దహించును
వీనిని జయించినవాడే మానవుడు
శ్రీరామ నీ దాసుడైతిని దాశరథీ!
నీతి శతకంలో పద్యం
కోపాత్ భవతి మూర్ఖత్వం మూర్ఖత్వాద్ వినశ్యతి
వినాశాత్ నరకం యాతి తస్మాత్ కోపం వివర్జయేత్
అంటే...
కోపం వల్ల మూర్ఖత్వం వస్తుంది. మూర్ఖత్వం వల్ల నాశనం. నాశనం వల్ల నరకం. అందుకే కోపాన్ని వదలిపెట్టాలి. శతక రచయితలు భావ యుక్తంగా చెప్తే, త్యాగరాజుల వారు రాగయుక్తంగా ‘శాంతము లేక సౌఖ్యము లేద’న్నారు. చివరిగా చెప్పినంత సులువుగా కోపాన్ని వదులుకోగలమా..మాటకు మాట తూటాలాగా వదిలితే శాంతి ఎక్కడ.. శాంతం లేనిదే శాంతి.. సహనం, శాంతం ఉంటే కోపాన్ని దూరం చేసుకోవచ్చు... డాక్టర్లు కూడా ఆరోగ్యం బాగుండాలంటే కోపం వద్దు.. ఈ దిçశలో బయలు దేరితే మన ఆరోగ్యదశ బాగుంటుంది.. ఆ ప్రయత్నంలో అడుగులేద్దాం.
– డా. కందాళ సత్యనారాయణ మూర్తి
నిర్వహణ: డి.వి.ఆర్.


