తొలి ఏకాదశి
సంవత్సరంలో సాధారణంగా 24 ఏకాదశులు వస్తాయి (అధిక మాసం వస్తే 26). అయితే ఆషాఢ శుక్ల ఏకాదశికి ‘తొలి ఏకాదశి‘ అనే విశిష్ట నామం వచ్చింది. దక్షిణాయనం ప్రారంభం అయ్యాక వచ్చే మొదటి ఏకాదశి కనుక మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి అంటే ప్రారంభ ఏకాదశి అని చెప్పవచ్చు.
ఈ ఏకాదశిని ఇంకా... దేవశయన ఏకాదశి, హరిశయనీ ఏకాదశి, పద్మ ఏకాదశి, ఆషాఢ శుక్ల ఏకాదశి .. అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) నాడు మేల్కొంటారని ఆగమాలు, పురాణాలు వివరిస్తాయి.
ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి నాడు విధిగా పారణ చేసినవాడు సర్వపాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతాడని పద్మ పురాణం తెలియజేస్తుంది. గాయత్రీ మంత్రం కంటే గొప్ప మంత్రం లేదు. తల్లి కంటే గొప్ప దైవం లేదు. కాశీ కంటే గొప్ప తీర్థం లేదు. ఏకాదశి వ్రతం కంటే గొప్ప వ్రతం లేదు అని స్కందపురాణం చెబుతోంది. భవిష్య పురాణం ప్రకారం చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది.
ఈ నాలుగు నెలలు జపం, ధ్యానం, దానం, విష్ణు ఆరాధన, పురాణ పారాయణం చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంది.
తొలి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం అత్యంత శ్రేయస్కరమని సంప్రదాయం.
భీష్ముడు యుధిష్ఠిరునికి ఏకాదశి మహిమను వివరిస్తూ, ఉపవాసం, దానం, విష్ణుభక్తి ప్రాముఖ్యతను బోధించాడు. అతని ఉపదేశాలే తరువాత అనేక ధర్మగ్రంథాలకు ఆధారమయ్యాయి. గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభువు ప్రతి ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ రామానుజులు ఏకాదశి ఆచరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మధుమేహం, గర్భధారణ, దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు.. ‘ఓం నమో నారాయణాయ’
భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, తాత్విక ప్రాముఖ్యత ఉంది. వాటిలో ఆషాఢ శుక్ల ఏకాదశి అనగా తొలి ఏకాదశిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా పరిగణిస్తారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని, ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
తొలి ఏకాదశి రోజున చేయవలసినవి
- బ్రహ్మముహూర్తంలో లేవాలి.
- స్నానం చేసి విష్ణుపూజ చేయాలి.
- ఓం నమో నారాయణాయ అనే నామ మంత్రాన్ని జపించాలి.
- విష్ణు సహస్రనామం చదవాలి.
- భగవద్గీత పారాయణం చేయాలి.
- తులసి దళాలతో శ్రీమహావిష్ణువును అర్చించాలి.
- ద్వాదశి రోజున అన్నదానం చేయాలి. విధిగా పారణ చేయాలి.
చేయకూడనివి
- కోపం, అసత్యం, పరనింద, మద్యపానం, మాంసాహారం, వ్యర్థ వాదనలు, అధిక నిద్రను త్యజించాలని శాస్త్రాలు చెబుతాయి.
తొలి ఏకాదశి చెప్పే సందేశం
తొలి ఏకాదశి మనకు కేవలం ఆహారాన్ని తగ్గించడం మాత్రమే కాదు, అహంకారం, కోపం, లోభం, అసూయ వంటి అంతరంగ దోషాలను తగ్గించుకోవాలని బోధిస్తుంది. భగవంతునికి దగ్గర కావడానికి ముందు మన మనస్సును పవిత్రం చేసుకోవాలనే సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తుంది. తొలి ఏకాదశి అనేది ఒక పండుగ మాత్రమే కాదు; అది భక్తి, నియమం, ఆత్మపరిశీలన, ధర్మాచరణ, ప్రకృతితో సమన్వయ జీవన విధానానికి శ్రీకారం చుట్టే మహోన్నత దినం. పద్మ పురాణం, స్కంద పురాణం, భవిష్య పురాణం వంటి శాస్త్రాలు దీనిని అత్యున్నత వ్రతాలలో ఒకటిగా కొనియాడాయి.
– మద్దికుంట శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రం
నిర్వహణ: డి.వి.ఆర్.


