సాక్షి, హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సీఐఎస్ఎఫ్ అధికారులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఎయిర్పోర్టు ప్రాంగణంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి.
ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. టెర్మినల్ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. బాంబ్ డిస్పోజల్ టీమ్లు ఆధునిక పరికరాలతో ప్రతి ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాయి.
బెదిరింపు సమాచారం ఎలా వచ్చింది?
ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చినట్లు భద్రతా వర్గాలకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. అది మెయిలా? కాలా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. బెదిరింపు వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? ఇది నిజమైన ముప్పా? లేక ఆకతాయిల చర్యా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు
భద్రతా తనిఖీలు కొనసాగుతున్నప్పటికీ విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులను అప్రమత్తంగా ఉంచుతూ.. సాధారణ కార్యకలాపాలు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు.
భద్రత మరింత కట్టుదిట్టం
ఇటీవల విమానాశ్రయాలకు బెదిరింపు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులోనూ భద్రతా ప్రమాణాలను కఠినతరం చేసి, అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచారు. బాంబు బెదిరింపు ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్టులో భద్రతా బలగాల తనిఖీలు కొనసాగుతున్నాయి.


