జంతర్మంతర్కు పోటెత్తిన నిరసనకారులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ పరిసరాల్లో ఉద్యమకారులపై పోలీసులు జులుం తర్వాత విద్యార్థుల ఉద్యమం బుధవారం మరింత ఉధృతమైంది. దేశ రాజధానితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మద్దతుదారులు జంతర్మంతర్కు తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా పరీక్షార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలతో కోలాహలంగా మారింది. వాళ్లు చేసే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.
బ్యాక్ప్యాక్లతో కొందరు కొన్ని రోజులపాటు ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చారు. సొంతంగా బ్యానర్లు సిద్ధంచేసుకుని, ప్లకార్డులు పట్టుకుని ఉద్యమస్థలికి చేరుకున్నారు. కొందరు పోలీస్బారికేడ్లను ఊతంగా చేసుకుని కూర్చోగా కొందరు సమీపంలోని చెట్లు ఎక్కి మొత్తం ఉద్యమప్రాంగణాన్ని ఆసక్తిగా గమనించారు. బుధవారం సాయంత్రం అక్కడ ఉన్న పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారని, ఈ ఘటనలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ జై ప్రకాశ్కు స్వల్పగాయమైందని పోలీసులు ఆరోపించారు.
మూతబడిన మెట్రోస్టేషన్లు..
ఎలాంటి అనూహ్య పరిణామాలు జరక్కుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఢిల్లీ అధికార యంత్రాంగం ఢిల్లీలో 17 మెట్రో స్టేషన్లను కొన్ని గంటలపాటు మూసేసింది. లోక్ కల్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్్థ, జన్పథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీవో, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్బాగ్, శివాజీ స్టేడియం, ఝాన్దేవాలన్ స్టేషన్లను మూసేశారు.
ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తూ...
ఉద్యమ స్ఫూర్తి పలు రాష్ట్రాల్లోనూ నిరసనకారులు పుణికిపుచ్చుకుని రాష్ట్ర రాజధానుల్లో ర్యాలీలు చేపట్టారు. బిహార్లో ‘లోక్భవన్ మార్చ్’పేరిట గవర్నర్ హౌస్కు ర్యాలీగా వెళ్లిన ఉద్యమకారులపై పోలీసులు బాష్పవాయుగోళాలు, జలఫిరంగులను ప్రయోగించి విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. లాఠీచార్జ్ సైతం చోటుచేసుకుంది. తమిళనాడులోనూ విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఉద్యమసంఘాలు కోయంబత్తూర్ తదితర చోట్ల ఢిల్లీ లాఠీచార్జ్ను నిరసిస్తూ ర్యాలీలు చేపట్టాయి.


