ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ప్రకటన
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని పక్షంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతానని ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపడుతున్న నిరసనలకు ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఈ నెల 27వ తేదీ వరకు ఎదురుచూస్తానన్నారు.
విద్యారంగంలో జవాబుదారీతనం, తన సొంత లద్దాఖ్ పర్యావరణం, సంస్కృతి, అక్కడి ప్రజల సంక్షేమానికి సంబంధించిన విషయాలలో జవాబుదారీతనం అనే రెండు కీలక అంశాలపైనే తన దృష్టి ఉందన్నారు. విద్యను ప్రభావితం చేసే నిర్ణయాల్లో పౌరులకు స్థానం ఉండాలని, అలాగే పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునే విషయాల్లో లద్దాఖ్ ప్రజల అభిప్రాయాలకు విలువివ్వాలని వాంగ్చుక్ స్పష్టం చేశారు. శనివారం కల్లా ఈ రెండింటిపై స్పందన రాకపోతే, సీజేపీ నాయకులతో కలిసి నిరాహార దీక్షకు కూర్చుంటానన్నారు.


