నీట్ రీ-ఎగ్జామ్కు ముందు కేంద్రం విధించిన టెలిగ్రామ్పై టెంపరరీ బ్యాన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టెలిగ్రామ్ నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించగా.. కోర్టు అందుకు అంగీకరించింది. దీంతో న్యాయస్థానంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
నీట్ యూజీ 2026 రీ-టెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని సవాలు చేస్తూ, టెలిగ్రామ్ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ తేజస్ కారియా విచారించేందుకు అంగీకరించారు. ఇవాళే ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
#BREAKING Telegram moves Delhi High Court against Centre's ban on the platform https://t.co/9ncovLLlaY
— Live Law (@LiveLawIndia) June 17, 2026
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. NEET రీ-ఎగ్జామ్ (జూన్ 21) దాకా కొన్ని రోజులు పాటు టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం విధించబడింది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న పేపర్ లీక్ రాకెట్లు, ఫేక్ మెసేజ్లు, మోసపూరిత ఛానల్స్ను అడ్డుకోవడమే ఈ చర్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమాచార సాంకేతిక చట్టం(IT Act) సెక్షన్ 69A కింద ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఎన్టీఏ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. అయితే ఇది లక్షలాది సాధారణ వినియోగదారులను ప్రభావితం చేస్తోందని టెలిగ్రామ్ తన పిటిషన్లో పేర్కొంది.
టెలిగ్రామ్ను అడ్డుకున్నంత మాత్రాన మిగతా యాప్లతో పేపర్ లీక్లు జరగడం లేదా? అని పిటిషన్లో కేంద్రానికి టెలిగ్రామ్ సూటి ప్రశ్న వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదానికి కారణమైన ప్రధాన అంశం నీట్ పరీక్షల చుట్టూ పెరిగిన ఫేక్ పేపర్ లీక్ నెట్వర్క్. “PAPER LEAKED NEET”, “Re-NEET 2026” వంటి పేర్లతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్స్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నాయని ఎన్టీఏ గుర్తించింది. కొందరు ఛానల్స్ కొన్ని వేల నుండి లక్షల రూపాయల వరకు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా..

టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిట్ ఫీచర్ను కూడా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. పరీక్ష తర్వాత ఫేక్ పేపర్ లీక్ సాక్ష్యాలు సృష్టించడానికి ఈ ఫీచర్ను దుర్వినియోగం చేస్తున్నారని ఎన్టీఏ ఆరోపించింది. అయితే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ తీవ్రంగా స్పందించారు. భారత్లో 15 కోట్లకు పైగా వినియోగదారులను ప్రభావితం చేసే ఈ చర్య తప్పుడు నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఇటు డిజిటల్ హక్కుల సంస్థలు కూడా దీనిని “ఓవర్ బ్రాడ్ రెస్పాన్స్”గా అభివర్ణించాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ చర్యను తాత్కాలిక భద్రతా చర్యగా పేర్కొంటోంది. పరీక్ష సజావుగా, మోసాలు లేకుండా నిర్వహించడమే లక్ష్యమని ఇటు ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కడం గమనార్హం.


