సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీట్ పేపర్ లీకేజీ మాస్టర్మైండ్ రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు 15మంది అరెస్టయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు నాసిక్లో పేపర్ను ముద్రించినట్లు గుర్తించారు. పరీక్షకు 42గంటల ముందు పేపర్ లీక్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్షలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు రాజస్థాన్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SOG) దర్యాప్తులో బయటపడింది. కోచింగ్ సమయంలో విద్యార్థులు సౌలభ్యం కోసం తయారు చేసే గెస్ పేపర్లోని 120 ప్రశ్నలు.. నీట్ పరీక్షలోని అసలు ప్రశ్నాపత్రంతో సరిపోవడంతో లీకేజీ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో నీట్ యూజీ 2026 పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) పరీక్షను రద్దు చేసి, రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
పేపర్ లీకేజీ కేసులో రాజస్థాన్ ఎస్వోజీ ఇద్దరిని మాస్టర్మైండ్స్గా అరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర) లీక్ నెట్వర్క్పై విచారణ కొనసాగుతోంది.
22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యారు. ఎన్టీఏ తెలిపిన ప్రకారం.. కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా రీ-ఎగ్జామ్ త్వరలో నిర్వహించనుంది. ఇప్పటికే చెల్లించిన ఫీజులు రిఫండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే పేపర్ లీకేజీతో విద్యార్థుల్లో అనిశ్చితి, మానసిక ఒత్తిడి పెరిగింది.


