హాల్‌ టికెట్‌ పొందడమే ఓ ప్రహసనం | NTA gives NEET candidates a harrowing time | Sakshi
Sakshi News home page

హాల్‌ టికెట్‌ పొందడమే ఓ ప్రహసనం

Jun 19 2026 5:07 AM | Updated on Jun 19 2026 5:07 AM

NTA gives NEET candidates a harrowing time

నీట్‌ అభ్యర్థులకు చుక్కలు చూపించిన ఎన్టీఏ 

నిమిషాల వ్యవధిలో అయిపోయే ప్రక్రియకు రోజుల తరబడి అగచాట్లు 

పరీక్షకు హాజరుకానున్న 23 లక్షల మంది 

14న హాల్‌టికెట్లు విడుదల చేస్తే బుధవారానికి 16 లక్షల మందే డౌన్‌లోడ్‌ 

నీట్‌ యూజీ పునఃపరీక్ష నిర్వహణ తేదీలో మార్పు లేదని ఎన్టీఏ వెల్లడి 

సాక్షి, అమరావతి: నేషనల్‌ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌) యూజీ–2026 పరీక్ష అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఓ ప్రహసనంగా మారిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పేపర్‌ లీక్‌ కావడంతో గత నెలలో నిర్వహించిన నీట్‌ పరీక్షను రద్దు చేసి ఈ నెల 21న(ఆదివారం) తిరిగి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రీ–ఎగ్జామినేషన్‌కు సంబంధించిన హాల్‌ టికెట్లను ఈ నెల 14న ఎన్టీఏ విడుదల చేసింది. ఎన్టీఏ వెబ్‌సైట్‌లో వరుస సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో నాలుగు రోజులైనా అభ్యర్థులందరూ హాల్‌టికెట్లు పొందలేని దుస్థితి నెలకొంది. దాదాపు 23 లక్షల మంది నీట్‌ రాయాల్సి ఉండగా, బుధవారం రాత్రికి 16 లక్షల మంది మాత్రమే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ఎన్టీఏ ప్రకటించింది. 

రోజుల తరబడి కుస్తీ 
వాస్తవానికి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడం అనేది కొన్ని నిమిషాల్లో ముగిసే ప్రక్రియ. అలాంటి ప్రక్రియకు ఏకంగా రోజుల తరబడి పడుతోందని విద్యార్థు లు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నీట్‌ పరీక్ష రద్దయిన నేపథ్యంలో విద్యార్థులు చెల్లించిన దరఖాస్తు రుసుమును రిఫండ్‌ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు నమోదు చేయాలని తొలుత ఎన్టీఏ నిబంధన పెట్టింది.

ఒక్కసారిగా సర్వర్లపై లోడ్‌ పెరగడంతో చాలామందికి అకౌంట్‌ వివరాలు సబ్మిట్‌ కాకపోగా, హాల్‌టికెట్లు హోల్డ్‌లో పడిపోయి విద్యార్థులు అవస్థలుపడ్డారు. ఈ క్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బ్యాంక్‌ వివరాలు తర్వాత సమర్పించేలా ఎన్టీఏ ప్రత్యామ్నాయ ఆప్షన్లు ఇచ్చింది. అయినప్పటికీ  గురువారం కూడా కొందరు అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.  

షెడ్యూల్‌ ప్రకారమే నీట్‌ 
నీట్‌ యూజీ పునఃపరీక్ష వాయిదా పడిందని సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారంపై గురువారం ఎన్టీఏ స్పందించింది. నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారమే ఈ నెల 21న పరీక్ష ఉంటుందని స్పష్టం చేసింది. వదంతులు, సోషల్‌ మీడియా ప్రచారాలను అభ్యర్థులు నమ్మవద్దంటూ ‘ఎక్స్‌’లో ఎన్టీఏ పోస్ట్‌ చేసింది. 

తేలికపాటి దుస్తులు ధరించాలి 
ఈ నెల 21న నీట్‌ యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తేలికపాటి దుస్తులు ధరించడంతోపాటు ట్రాన్సపరెంట్‌ వాటర్‌ బాటిళ్లనే తెచ్చుకోవాలని ఎన్టీఏ సూచించింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు భద్రతా తనిఖీలు సజావుగా సాగాలంటే అభ్యర్థులు రిపోర్టింగ్‌ సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. 
» సాంకేతిక, ఇతర కారణాలతో నీట్‌ రాసే విద్యార్థుల బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ పూర్తికాకపోయినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఎన్టీఏ వెల్లడించింది.  

పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవి 
» ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో హాల్‌ టికెట్లు తడిసిపోకుండా ఉండేందుకు పారదర్శక ప్లాస్టిక్‌ పౌచ్‌లకు అనుమతి. 
» విద్యార్థులు మతపరమైన నమ్మకాలకు సంబంధించిన వస్తువులు ధరించడానికి అనుమతి ఉంది. అయితే, పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి వీలుగా విద్యార్థులు ముందుగానే చేరుకోవాలి.   
» స్లిప్పర్స్, లో–హీల్స్‌ పాదరక్షలు ధరించాలి. హై–హీల్స్‌ ధరిస్తే తనిఖీలు ఎదుర్కోవాలి. 

వీటిపై నిషేధం 
» మొబైల్‌ ఫోన్‌లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ డివైజ్‌లు, ఇయర్‌ ఫోన్లు వంటి ఇతరæ కమ్యూనికేషన్‌ పరికరాలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదు.  
» లోహపు వస్తువులు, పెద్ద బకిల్స్‌ ఉన్న బెల్టులు, భారీ ఆభరణాలు, ఇతర మెటల్‌ యాక్సెసరీస్‌ను అనుమతించరు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement