
కష్టే ఫలి. శ్రమయేవ జయతే.. అని అన్నారు పెద్దలు. ఇక్కడో కుర్రాడి సక్సెస్ను చూస్తే ఆ మాట ఒప్పుకుని తీరాల్సిందే. కరోనా టైంలో తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న యువకుడు.. రేయింబవలు కష్టపడ్డాడు. తాను అనుకున్నది సాధించి.. ఇప్పుడు నీట్ విజేతగా నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నాడు.
జార్ఖండ్కు చెందిన రోహిత్ కుమార్(Jharkhand Rohit Kumar).. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షలో 549 మార్కులతో ఆల్ ఇండియాలో 12,484 ర్యాంక్ సాధించాడు(కేటగిరీ వైజ్గా 1,312 ర్యాంక్). ఫిజిక్స్ వాలాగా పేరుకున్న అలఖ్ పాండే.. తాజాగా ఈ యువకుడిని పలకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రోహిత్ కుమార్ తండ్రి స్థానికంగా కూరగాయలు అమ్మేవాడు. 12 తరగతి పూర్తయ్యాక పూర్తిగా నీట్ మీద దృష్టి పెట్టేందుకు పైచదువులు మానేశాడు రోహిత్. ఆపై కరోనా టైంలో ఓ మెడికల్ షాపులో పని చేసే సమయంలో ఎలాగైనా వైద్య వృత్తిలో స్థిరపడాలనే కసి మొదలైంది. ఆపై సెల్ ఫోన్ పౌచులు అమ్మకునే దుకాణం తెరిచి.. రెండు పడవలపై ప్రయాణం చేస్తూ వచ్చాడు.
ఉదయం 7గం. నిద్రలేచే రోహిత్ కుమార్.. పగలంతా తన బండి మీద సెల్ ఫోన్ పౌచులు అమ్ముకున్నాడు. ఆపై రాత్రి వేళలో ఇంటికి చేరి పుస్తకాలతో కుస్తీ పడుతూ వచ్చాడు. అలా అలా.. అర్ధరాత్రి 3గం. చదివేవాడు. ఇదే అతని రోజూవారీ చర్యగా మారింది. నీట్లో ర్యాంకుతో రోహిత్ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తనకు వచ్చిన ర్యాంకుకు.. సొంత రాష్ట్రంలోనే సీటు రావాలని ఆశలు పెట్టుకున్నాడతను. చివరగా.. వెళ్తూ వెళ్తూ ఫిజిక్స్ వాలా అలఖ్ పాండే ఆ కుర్రాడికి డాక్టర్ కోటును బహుకరించాడు. కాబోయే డాక్టర్గా ఆ వైట్ కోట్ను ధరించి మురిసిపోయిన ఫొటో, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 22.09 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. గతేడాదితో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. ఫలితాల్లో.. ఈ ఏడాది రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ 99.09999547 శాతంతో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ ఫిమేల్ టాపర్గా నిలిచింది. ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా లక్షా 70 వేల మంది అర్హత సాధించగా.. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి అభ్యర్థులు తర్వాతి స్థానాల్లో నిలిచారు.