
ఒకే షిఫ్టులో నిర్వహణ..
ఈ నెల 31 నుంచి అడ్మిట్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వచ్చే నెల 3న నీట్–పీజీ ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు 45 నిమిషాలకు ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాల్సి ఉంది. వాస్తవానికి జూన్ 15న రెండు షిఫ్టుల్లో జరగాల్సిన ఈ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎన్బీఈఎంఎస్ దీన్ని ఆగస్టు 3కు వాయిదా వేసింది.
దేశవ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ పీజీ రాయనుండగా తెలంగాణ నుంచి సుమారు 10 వేల మంది రాసే అవకాశం ఉందని అంచనా. ఇందుకోసం రాష్ట్రంలో హైదరాబాద్ సహా 10 కేంద్రాలను ఎంపిక చేశారు. విద్యార్థులకు జూలై 31 నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచనున్నారు. సెప్టెంబర్ 3 నాటికి ఫలితాలను ఆన్లైన్లో పొందుపరచనున్నారు. గతేడాది కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 25,791 సీట్లను కేటాయించారు.