సాక్షి, తిరుపతి: లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నా ఇల్లు, ఆఫీస్పై దాడి చేశారు. 5 గంటలు నుంచి 12 గంటలు వరకు దాడి జరుగుతూనే ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు’’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, వైవిధ్యాలు ఉంటాయి. పోలీసులను ఏవిధంగా ఉపయోగిస్తున్నారో చంద్రబాబు ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించమని కోరుతున్నా.. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు సరికాదు. బీజేపీ, సీపీఐ, జనసేన పార్టీ నాయకులు స్పందించారు. పార్టీలకు అతీతంగా నా అరెస్ట్పై స్పందించారు. జనసేన పార్టీ అధినేత స్పందించలేదు.
లడ్డూ వివాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఛార్జిషీట్ ఫైల్ చేశాక మీకు తొందర ఎందుకు? వాస్తవాలు చెప్పారు కదా.. భగవంతుడ్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి కోపాగ్నికి బలికాక తప్పదు’’ అని అంబటి పేర్కొన్నారు.


