సాక్షి, విశాఖ: కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలను మభ్య పెట్టడానికే ఇలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు విమర్శించారు. అప్పులను బడ్జెట్లో చూపకుండా దాట వేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో 22 శాతం అధికంగా అప్పు పెరిగిందని తెలిపారు. ఎవరిది విధ్వంస పాలనలో ప్రజలు గుర్తించాలని కోరారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తప్పుల తడకగా ఉంది. బడ్జెట్, తిరుమల లడ్డూ అంశాలపై చర్చ లేకుండా చేశారు. బడ్జెట్ రూపకల్పనలో అనేక అవకతవకలు ఉన్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ఆదాయ, వ్యయానికి సంబంధించిన లెక్కలు చెప్పాలి. ఈ బడ్జెట్ అంతా లోపభూయిష్టంగా ఉంది. అప్పులను బడ్జెట్లో చూపకుండా దాట వేశారని ఆరోపించారు.
గతంలో అప్పులపై.. బాబు, పవన్, బీజేపీ అనేక ఆరోపణలు చేశారు. కానీ, ఇప్పుడు రాష్ట్ర రెవెన్యూ వృద్ధిపై తప్పుడు లెక్కలు చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెరగకుండా డీఎస్డీపీ ఎలా పెరుగుతుంది. ఆదాయం, వ్యయానికి సంబంధించిన లెక్కలకు ప్రజలకు తెలియజేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. రూ.10 లక్షల కోట్లు అప్పు అని తప్పుడు ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బాబు హయాంలో 22 శాతం అధికంగా అప్పు పెరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పు ఎంత? ఎవరిది ఆర్ధిక విధ్వంసం.. ప్రజలు అర్ధం చేసుకోవాలి. వైఎస్ జగన్ పాలనలో 15వేలకు పైగా సచివాలయాలు నిర్మించి.. లక్షా 35 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమా?. ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేయడమే విధ్వంసమా?. 17 మెడికల్ కాలేజీలు తీసుకు రావడం విధ్వంసమా?. తెచ్చిన కాలేజీలను ప్రైవేటుపరం చేస్తామనడం విధ్వంసమా? ప్రజలే తెలుసుకోవాలి.


