సాక్షి, వినుకొండ: తాను ఇరవై ఏళ్ల ముందు జరగబోయే విషయాలను ఊహించి ఇప్పటి నుంచే నిర్ణయాలు తీసుకుంటానని, స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది తానేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వినుకొండలో ఆయన పర్యటించారు. తొలుత చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు.
అనంతరం, స్థానిక ఎన్ఎస్పీ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రానున్న రోజుల్లో ఏఐ ద్వారా వ్యవసాయం అందుబాటులోకి తెస్తామన్నారు. మార్చి నుంచి అన్ని గ్రామాల్లో చెత్తను సేకరించి సంపదగా మారుస్తామన్నారు. జపాన్ మాదిరిగా ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
కల్తీపై చంద్రబాబు పొంతన లేని మాటలు..
తిరుపతి వెంకన్న లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిందని.. అలాగే, సిట్ నివేదికలో మాత్రం నెయ్యి లాంటి కెమికల్ వాడారని ఉందని చంద్రబాబు పొంతనలేని మాటలు చెప్పారు. రౌడీయిజానికి పాల్పడే వారిపై, సంఘవిద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఢిల్లీలో శుక్రవారం ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సభలో దుస్తులు విప్పి నిరసన తెలియజేయడాన్ని ఖండించారు. 2014లో ముఖ్యమంత్రిగా వినుకొండకు వచ్చిన చంద్రబాబు అప్పుడిచ్చిన హామీలే మళ్లీ ఇచ్చారు.
సీఎం పర్యటనకు నిరసన సెగ..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వినుకొండ పర్యటన సందర్భంగా ఆయనకు నిరసన సెగ తగిలింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న వరికపూడిశెల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ వరికపూడిశెల జలసాధన సమితి నాయకులు ఆందోళన చేపట్టి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుకు 1996లో చంద్రబాబే శంకుస్థాపన చేశారని.. కానీ మూడు దశాబ్దాలు గడిచినా అడుగు ముందుకు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం పల్నాడు ప్రజలను వంచించడమేనని వారు మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేస్తామని సభావేదికలోనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.


