కింజరాపు రామ్మోహన్ నాయుడు చుట్టూ ముసురుకున్న వివాదం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విమాన ప్రమాదం వెనక కుట్ర కోణం ఆరోపణలు
ఆ సంస్థతో టీడీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయంటున్న మహారాష్ట్ర విపక్ష నేతలు
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఏదో ఒక విమర్శ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడాయన చుట్టూ ముసురుకుంటున్న వివాదం సామాన్యమైంది కాదు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన విమాన ప్రమాదం చుట్టూ అల్లుకున్న కుట్రకోణాలు రామ్మోహన్ నాయుడు వైపు వేలెత్తి చూపుతున్నాయి. ప్రమాదానికి కారణమైన విమాన సంస్థకు, టీడీపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా గుప్పుమంటున్నాయి. విచారణ సజావుగా సాగాలంటే తక్షణమే రామ్మోహన్నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మూడోసారి ఎంపీని చేసిన జిల్లాకు చేసిందేమీ లేదని, పదవులు అనుభవించడం తప్ప ప్రజలకు ఒరిగిందే మీ లేదన్న వాదన సర్వత్రా ఉంది. ఈ విషయమై ఆ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సారి జిల్లా ప్రజల దెబ్బ ఏంటో చూస్తారని దాదాపు చెప్పుకుంటున్నారు. దానికితోడు కేంద్ర మంత్రి పదవి వచ్చా క మరింత మారిపోయారని, పబ్లిసిటీ తప్ప జిల్లాకు చేసిన మేలేమీ లేదని బాహా టంగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాను బాధ్యతలు చేపడుతున్న కేంద్ర పౌర విమానయాన శాఖలో తరచూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు.
బాధ్యతలు స్వీకరించిన కొన్నాళ్లకే ఢిల్లీ ఎయిర్పోర్టులో నిర్మాణంలో ఉన్న కట్టడం కూలిపోయింది.
లండన్ వెళ్లాల్సిన విమానం అహ్మదాబాద్లో కూలిపోయింది. ఈ ఘటన సమయంలో అందరూ విషాద ఛాయల్లో ఉంటే ఘటనా సందర్శన సందర్భాన్ని రీల్స్గా సోషల్ మీడియాలో పోస్టు చేయడం మరింత విమర్శలకు దారితీసింది.
జాతీయ, అంతర్జాతీయ విమానాలను ఇండిగో సంస్థ ఆకస్మికంగా రద్దు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. వేలాది మంది ప్రయాణికులు శాపనార్థాలు పెట్టారు. కొన్ని రోజుల పాటు విమాన సర్వీసులు రద్దయిపోయినా కేంద్రమంత్రిగా రామ్మోహన్నాయుడు ఏం చేయలేకపోయారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా చోద్యం చూశారని దేశవ్యాప్తంగా విమర్శల పాలయ్యారు. జాతీయ మీడియా అయితే ఉతికి ఆరేసింది. ప్రతీదీ వ్యక్తిగత ప్రచారం కోసం తప్ప శాఖ కోసం పనిచేయడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.
కుట్ర కోణం ఆరోపణలు..
రామ్మోహన్ నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పౌర విమానయాన శాఖలోనే మరో వివాదం అలుముకుంది. ఈ సారి చిన్నా చితక వ్యవహారం కాదు. ఏకంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనక కుట్ర కోణం దాగిందన్న ఆరోపణలు సంచలనమయ్యాయి. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి అసలు విలువ కంటే ఎక్కువగా ఇన్స్యూరెన్స్ చేయించడంతో పాటు మరో రూ.210కోట్ల లయబిలిటి ఇన్స్యూరెన్స్ చేయించడం వెనక కుట్ర దాగి ఉందని ఎన్సీపీ నేతలతో పాటు ఎమ్మెల్యే రోహిత్పవార్ అనుమానాలు వ్యక్తం చేశారు. విమాన సంస్థ ‘వీఎస్ఆర్ వెంచర్స్’ పై ఆరోపణలు కూడా చేశారు.
టీడీపీకి లింకులంటూ...
ప్రమాదానికి కారణమైన విమానానికి చెందిన వీఎస్ఆర్ వెంచర్స్తో టీడీపీ నేతలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వీఎస్ఆర్ సంస్థ అధినేత ఇంట్లో జరిగిన వేడుకలకు ఏపీ నేతలు హాజరయ్యారని, ప్రమాదం జరిగిన వెంటనే వీఎస్ఆర్ సంస్థ దేశం విడిచి వెళ్లిపోయారని మహారాష్ట్ర నేతలు నేరుగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడీ ఆరోపణలే పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ఇన్సూ్యరెన్స్ కుంభకోణం, వ్యక్తిగత సంబంధాల ఆరోపణలు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని చుట్టు ముట్టాయి. కుట్ర కోణం ఉందన్న అనుమానం నేపథ్యంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, అప్పుడే నిష్పక్షపాత విచారణకు అవకాశం ఉంటుందని రోహిత్ పవార్తో పాటు మరికొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు.


