సాక్షి, హైదరాబాద్: ఈ నెల జూన్ 21న జరగనున్న నీట్ యూజీ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఏటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా తరలించేందుకు భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించుతోంది. ఈ వివరాలను NTA డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. దీంతో ఒక పరీక్ష కోసం విమానాల్ని వాడిన ఎగ్జామ్గా నీట్ రికార్డు సృష్టించనుంది.
నీట్పరీక్ష ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె. రామకృష్ణారావు నేతృత్వంలో జరిగిన వర్చువల్ సమావేశంలో అభిషేక్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షల పారదర్శకతను, భద్రతను కాపాడటానికి ఈసారి మునుపెన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయి భద్రతా ప్రోటోకాల్స్ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అభిషేక్ సింగ్ మాట్లాడుతూ "పరీక్షా ప్రక్రియ సమగ్రతను, భద్రతను కాపాడటానికి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రశ్నపత్రాల రవాణా కోసం తొలిసారిగా భారత వైమానిక దళాన్ని ఉపయోగిస్తున్నాము" అని అన్నారు.
కాగా వైమానిక దళ అంశంపై ఇటీవలే మాట్లాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ జూన్ నెలలో ఉండే వాతావరణ పరిస్థితులు, రవాణా ఇబ్బందులు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రశ్నపత్రాలను సురక్షితంగా, సకాలంలో చేరవేసేందుకు వైమానిక దళ సహాయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే కేవలం ప్రశ్నాపత్రాల కోసం మాత్రమే వైమానిక దళం సహాయం తీసుకుంటామని భద్రత కోసం మరే సాయం తీసుకోమని స్పష్టం చేశారు.
గత మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల రద్దు చేస్తున్నట్లు మే 12న ఎన్టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్ 21న దేశవ్యాప్తంగా తిరిగి పరీక్ష నిర్వహించనున్నారు.


