
దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం
552 నగరాలు, పట్టణాలతో పాటు దేశం వెలుపల 14 చోట్ల నీట్ నిర్వహణ
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి
మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష
నిమిషం ఆలస్యమైనా ‘నో ఎంట్రీ’
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ–2025ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆదివారం నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాలతో పాటు దేశం వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెన్, పేపర్(ఆఫ్లైన్) విధానంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో కలిపి 13 భాషల్లో ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తోంది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. గతేడాది నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్తో పాటు ఇతర అవకతవకలు చోటు చేసుకోవడంతో.. ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులను పక్కాగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని అన్ని జిల్లాల యంత్రాంగాలను ఎన్టీఏ ఆదేశించింది.
జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు..
ఈసారి జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్ రాసే అవకాశముందని అంచనా. గతేడాది 24.06 లక్షల మంది దరఖాస్తు చేయగా 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి గతేడాది 66 వేల మంది దరఖాస్తు చేయగా.. 64 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి కూడా గతేడాది స్థాయిలోనే రాష్ట్రం నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి సహా 29 నగరాలు, పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నీట్లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 6,500 మేర సీట్లు ఉన్నాయి.