ముంబై: గత దఫాలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీ ప్రకంపనల నేపథ్యంలో, నేడు (ఆదివారం) దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్-యూజీ పునఃపరీక్షకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహారాష్ట్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నీటీ యూజీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నాగ్పూర్, అహిల్యానగర్, లాతూర్ తదితర ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు, సీసీటీవీ కెమెరాలతో కూడిన గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా పరీక్షకు హాజరుకావాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు.
నాగ్పూర్లో ఉచిత ప్రయాణం
నాగ్పూర్లోని 30 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 12,512 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలు ముమ్మరం చేయడంతో అక్కడ దాదాపు ‘పోలీస్ క్యాంప్’ వాతావరణం తలపిస్తోంది. అభ్యర్థుల గుర్తింపును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు, విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకుండా నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ తమ ‘ఆప్లీ బస్’ సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. అడ్మిట్ కార్డ్ చూపించి విద్యార్థులు ఈ ఏసీ బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు.
అహిల్యానగర్లో సీఆర్పీఎఫ్ పహారా
అహిల్యానగర్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు జరిగే ఈ పరీక్ష కోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 5,385 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రశ్నపత్రాల రవాణాలో ఎలాంటి లోపాలు జరగకుండా స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచారు.
లాతూర్లో తగ్గిన కేంద్రాలు
గత వివాదాల దృష్ట్యా లాతూర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం కోసం పరీక్షా కేంద్రాల సంఖ్యను గతేడాది ఉన్న 34 నుండి ఈసారి 24కి తగ్గించింది. ఇక్కడ సుమారు 14,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతను సమీక్షించారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించడానికి డ్యూటీ మేజిస్ట్రేట్లు, రాష్ట్ర అబ్జర్వర్లను ప్రత్యేకంగా నియమించారు.


