కోడెర్మా: దేశంలో ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల ఒత్తిడి విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. జార్ఖండ్లోని కోడెర్మా జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద ఘటన చర్చనీయాంశంగా మారింది. ‘నీట్’ కోసం సిద్ధమవుతున్న 16 ఏళ్ల ఒక ప్రతిభావంతురాలైన విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. పరీక్షల ప్రక్రియలో నెలకొన్న అనిశ్చితి, తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఆమె బలైపోయిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ రాస్తూనే ఆ బాలిక గదిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
ఆన్లైన్ పరీక్ష రాస్తూ..
తమ అమ్మాయి చదువులో ఎంతో చురుకైనదని, ‘నీట్’లో విజయం కోసం పట్టుదలతో చదువుతోందని బంధువులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన ఆమె, అనంతరం ఇంటికి తిరిగి వచ్చి సొంతంగా ప్రిపరేషన్ కొనసాగిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షలు రాయాలనే పట్టుదలతో ఉన్న ఆమె, నీట్ పరీక్షలో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకంతో ఉంది. అయితే ఇంట్లోనే ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ రాస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఎంతసేపటికీ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
కేసు నమోదు.. ముమ్మర దర్యాప్తు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తి చేసి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఉదంతంపై స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఎవరిపైనా ఎటువంటి అధికారిక ఫిర్యాదు అందలేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థిని నీట్ పరీక్షకు హాజరైన విషయం నిజమే అయినప్పటికీ, కుటుంబ సభ్యులు ప్రాథమికంగా ఇచ్చిన దరఖాస్తులో పరీక్ష ఒత్తిడికి సంబంధించిన అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించలేదని పోలీసులు వివరించారు.
ప్రాణాంతకంగా మారుతున్న పరీక్షల టెన్షన్
ఈ విషాద ఉదంతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న విపరీతమైన అకడమిక్ ఒత్తిడిని మరోసారి తెరపైకి తెచ్చింది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు పోటీపడే నీట్ వంటి కఠినమైన ప్రవేశ పరీక్షలు, వారిపై తీవ్ర మానసిక భారాన్ని మోపుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఒత్తిడి, పరీక్షల నిర్వహణలో అస్థిరత తదితర కారణాలు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో విద్యార్థులకు సరైన కౌన్సెలింగ్ సపోర్ట్ సిస్టమ్స్ అందుబాటులో ఉంచాలని, ఒత్తిడిని తగ్గించే ముందస్తు చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు, నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘చికెన్స్ నెక్’పై భారత్ పట్టు.. చైనా, ‘బంగ్లా’ కుట్రలకు చెక్!


