
సాంగ్లీ: నీట్లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ తండ్రి.. కూతురిని కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాంగ్లికి చెందిన 17 ఏళ్ల సాధన వైద్య జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రాసింది. ఇటీవలే ఫలితాలు వచ్చాయి. సాధనకు తక్కువ మార్కులు రావడంతో ఆగ్రహించిన ధోండి రామ్ భోస్లే శుక్రవారం రాత్రి ఆమెను కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆమె తల్లి ప్రీతి భోస్లే.. స్థానిక ఆసుపత్రికి తరలించింది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అనంతరం, అక్కడ చికిత్స పొందుతూ సాధన మరణించింది. కూతురికి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ప్రీతి.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు.. ధోండి రామ్ భోస్లేను ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జూన్ 24 వరకు పోలీసు కస్టడీకి విధించారు.